IPL : ఐపీఎల్ 17వ సీజన్(IPL 2024 Mini Auction) వేలానికి మరో వారం గడువే ఉంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. మినీ వేలంలో గెలుపు గుర్రాలను కొనేందుకు కాచుకొని ఉన్నాయి. ఇక బీసీసీఐ.. ఐపీఎల్ మీడియా హక్కుల(Media Rights) ద్వారా భారీగా సొమ్ము చేసుకోవాలనే ప్రణాళికల్లో ఉంది. అవును.. రాబోయే సీజన్లలో ఐపీఎల్ మీడియా రైట్స్కు భారీ డిమాండ్ ఉండనుంది. 50 బిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో రూ. 4 లక్షల కోట్లు పలికే అవకాశముందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్(Arun Dhumal) అన్నాడు.
‘గత పదిహేనేండ్లలో ఐపీఎల్ మీడియా హక్కులకు ఎంత డిమాండ్ ఉందో చూశాం. అదే పరిస్థితి కొనసాగితే 2043 వరకూ రూ. 4 లక్షల కోట్లుకు పడగలెత్తే అవకాశం ఉంది. అయితే.. ఫ్యాన్స్కు మరింత చేరువ అయ్యేందుకు మేము ఇంకాస్త సృజనాత్మకంగా ఆలోచించాల్సి ఉంది. ఆట పరంగానూ మరిన్ని మెరుగులు దిద్దుతాం. అంతేకాదు త్వరలోనే ఒలింపిక్స్లో క్రికెట్ రీ – ఎంట్రీ ఇవ్వనుంది. మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్కు ఆదరణ పెరుగుతోంది’ అని అరుణ్ తెలిపాడు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టీ20 లీగ్స్ ఉన్నా ఐపీఎల్ క్రేజే వేరే. అత్యంత సంపన్నమైన బీసీసీఐ నిర్వహించే ఈ టోర్నీ కాసుల వర్షం కురిపిస్తోంది. 2022 సీజన్లో ఐపీఎల్ మీడియా రైట్స్ రూ.48 వేల రూ.48 వేల కోట్లు పలికాయి. స్టార్ ఇండియా, వయాకామ్ 18, టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలు రూ. 48, 390 కోట్లకు హక్కుల్ని దక్కించుకున్నాయి. వచ్చే ఐదేళ్ల పాటు.. 2027 వరకూ ఇదే ధర ఉండనుంది. ఆ తర్వాత ఈ ధర అమాంతం పెరిగినా ఆశ్చర్యం వేయకపోవచ్చు.