న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కుల వేలం జోరుగా సాగుతున్నది. 2023-27 కాలానికి గానూ బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహిస్తుండగా.. తొలి రోజు ఆదివారం వేలం ముగిసేసరికి మీడియా హక్కుల విలువ రూ. 42 వేల కోట్లు దాటినట్లు సమాచారం. నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్వహిస్తున్న ఈ వేలంలో.. ప్రధానంగా ముఖేశ్ అంబానీకి చెందిన వయాకామ్ 18, డిస్నీ స్టార్, సోనీ, జీ పోటీపడుతున్నాయి. నేడు కూడా కొనసాగనున్న ఈ బిడ్డింగ్లో.. ఊహించని ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ. 50 వేల కోట్ల మార్క్ను దాటినా ఆశ్యర్చపోవాల్సిన అవసరం లేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ ఇదే జరిగితే క్రీడాలోకంలో ఇదే అతిపెద్ద మీడియా డీల్ కానుంది. తొలి రోజు ఏడు గంటల పాటు కొనసాగిన వేలంలో.. ఏ, బి, సి, డి అనే నాలుగు విభాగాల్లో హక్కులు దక్కించుకునేందుకు ప్రసారదారులు పోటీపడ్డారు. అందులో ప్యాకేజీ-‘ఏ’లో స్వదేశంలో టీవీ ప్రసార హక్కులు, ప్యాకేజీ-‘బి’లో స్వదేశంలో డిజిటల్ హక్కులుల భారత్లో టీవీ ప్రసార హక్కులు, భారత్లో డిజిటల్ హక్కులు, ప్యాకేజీ-‘సి’లో నాన్-ఎక్స్క్లూజివ్ డిజిటల్ హక్కులు, ప్యాకేజీ-‘డి’లో ఓవర్సీస్ టీవీ, డిజిటల్ హక్కులు ఉన్నాయి.
ఒక్కో మ్యాచ్కు వంద కోట్లు
ప్రస్తుతం బిడ్డింగ్ కొనసాగుతున్న ధరను బట్టి లెక్క కడితే.. ఒక్క ఐపీఎల్ మ్యాచ్ హక్కుల కోసం కంపెనీలు రూ. 105 కోట్లు కేటాయించేందుకు సిద్ధమయ్యాయి. రెండో రోజు దీని ధర మరింత పెరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి తెలిపారు. ‘ఒక్కో మ్యాచ్కు కనీసం రూ. 49 కోట్ల ప్రాథమిక ధరను కేటాయించగా.. తొలి రోజు బిడ్డింగ్ ముగిసే సరికి టీవీ, డిజిటల్ హక్కులు కలుపుకొని దాని విలువు రూ. 105 కోట్లు దాటింది. మా అంచనా ప్రకారం మొత్తం విలువ రూ. 50 వేల కోట్లు దాటుతుందనుకుంటున్నాం’ అని ఆయన అన్నారు. కాగా.. 2017-22 వరకు ఐదేండ్లకు గానూ డిస్నీ స్టార్ రూ. 16,347 కోట్లకు ఐపీఎల్ హక్కులు దక్కించుకోగా.. ఇప్పుడా ధర మూడు రెట్లు పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది.