లక్నో: చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ రైద్దెంది. బుధవారం ఇరు జట్ల మధ్య లక్నో వేదికగా జరిగిన పోరుకు వర్షం ఆటంకం కలిగించింది. ఈ సీజన్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడం ఇదే తొలిసారి కాగా.. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. టాస్ ఓడిన లక్నో మొదట 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసిన సమయంలో వర్షం దంచికొట్టింది. మొదట చిరుజల్లుగా మొదలైన వర్షం ఆ తర్వాత పెరగడంతో చాలాసేపు వేచి చూసిన అంపైర్లు చివరకు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
గత మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ రాహుల్ స్థానంలో కృనాల్ పాండ్యా లక్నో జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆయుష్ బదోనీ (33 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించాడు. కృనాల్ (0), స్టోయినిస్ (6), కరణ్ శర్మ (9), మయేర్స్ (14), వోహ్రా (10) విఫలమయ్యారు. 44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన జట్టును బదోనీ ఆదుకున్నాడు. అలీ, తీక్షణ, పతిరణ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
మీరు నిర్ణయించుకున్నారు.. నేను కాదు :
మ్యాచ్ ఆరంభానికి ముందు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. టాస్ కోసం వచ్చిన చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ‘మీ చివరి సీజన్ను ఆస్వాదిస్తున్నారా’ అని కామెంటేటర్ ప్రశ్నించాడు. దీనికి స్పందించిన మహీ ‘ఇది నా చివరి ఐపీఎల్ అని మీరు నిర్ణయించుకున్నారు. నేను కాదు’ అని నవ్వుతూ బదులిచ్చాడు. దీంతో వ్యాఖ్యాత మైదానానికి పోటెత్తిన ప్రేక్షకుల వైపు చూస్తూ.. ‘మహీ వచ్చే ఏడాది కూడా ఆడేందుకు వస్తాడు’ అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ధోనీ అభిమానుల్లో జోష్ నింపాయి.