బీసీసీఐతో పాటు భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియపై ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. 2023-2027 కాలానికి గాను నాలుగు ప్యాకేజీలలోని ఎ (ఇండియాలో టీవీ హక్కులు), బి (ఇండియాలో డిజిటల్ రైట్స్) హక్కులు రూ. 43,255 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్యాకేజీ ఎ- రూ. 23,575 కోట్లు (ఒక్కో మ్యాచ్ కు రూ. 57.5 కోట్లు), ప్యాకేజీ బి-రూ. 19,680 కోట్ల (రూ. 48 కోట్లు)కు అమ్ముడుపోయినట్టు తెలుస్తున్నది.
వయాకామ్ (రిలయన్స్), డిస్నీ స్టార్, సోనీ నెట్వర్క్ మధ్య హోరాహోరిగా సాగుుతున్న వేలం ప్రక్రియలో ప్రధానంగా స్టార్, సోనీల మధ్యే పోటీ నెలకొన్నట్టు తెలుస్తున్నది. అయితే ప్యాకేజీ ఎ, బి హక్కులకు సోనీ నెట్వర్క్ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నేటి సాయంత్రం వరకు దీని గురించి పూర్తి వివరాలు బయటకు వస్తాయి. గతంలో 2007-2018 వరకు ఐపీఎల్ ప్రసార హక్కులు సోనీ చేతిలోనే ఉండేవి. తిరిగి మళ్లీ అవి దాని చేతిలోకే వెళ్లునుండటం గమనార్హం.
ఎ,బి ప్యాకేజీకి వేలం ముగిసిన నేపథ్యంలో సి(ప్లేఆఫ్స్ తో పాటు కొన్ని ప్రత్యేక మ్యాచ్ లు), డి (ఉపఖండం ఆవల) ప్యాకేజీలకు వేలం జరుగనుంది. నేటి సాయంత్రంతో వేలం ముగియనుంది. సాయంత్రం బీసీసీఐ దీనిమీద అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.