RCB vs PBKS | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని అందుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను 60 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత విరాట్ కోహ్లీ (92) బౌండరీలతో విరుచుకుపడగా.. రజిత్ పాటిదార్, కామెరూన్ గ్రీన్ అతనికి తోడయ్యారు. దీంతో ఆర్సీబీకి కొండంత స్కోర్ను అందించారు. అనంతరం భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన పంజాబ్ను ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేశారు. ఆర్సీబీ ధాటికి నిలబడి రుసో (61) ఒక్కడే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ అంతగా ప్రభావం చూపించలేకపోయారు. దీంతో పరుగుల వేటలో పంజాబ్ ఎంత కష్టపడినప్పటికీ లాభం లేకుండా పోయింది. 17 ఓవర్ల వద్దనే ఆలౌట్గా నిలిచింది. కాగా, ఈ విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్ సజీవంగా నిలిచాయి. ఇక ఈ ఓటమితో పంజాబ్ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది.
టాస్ ఓడిన ఆర్సీబీకి ఆదిలోనే పంజాబ్ అరంగేట్ర పేసర్ విధ్వత్ కవెరప్ప షాకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(9)ను ఔట్ చేసిన కవెరప్ప.. తర్వాతి ఓవర్లో డేంజరస్ విల్ జాక్స్(12)ను వెనక్కి పంపాడు. దాంతో, 43 పరుగులకే బెంగళూరు రెండు వికెట్లు పడ్డాయి.
ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్(55) పంజాబ్ బౌలర్లను చితక్కొట్టాడు. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీతో జట్టు స్కోర్ను పరుగులు పెట్టించాడు. ధాటిగా ఆడుతున్న అతడు బెయర్స్టోకు దొరికాడు. దాంతో, 119 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ పడింది. పాటిదర్ బౌండరీల వాన వెలిసినా.. మేఘాలు కుమ్మరించిన వర్షం కారణంగా మ్యాచ్కు కాసేపు అంతరాయం కలిగింది.
పదో ఓవర్ తర్వాత కోహ్లీ మరింత రెచ్చిపోయాడు. లివింగ్స్టోన్ బౌలింగ్లో కాస్త ఇబ్బంది పడినా.. సామ్ కరన్, అర్ష్దీప్ సింగ్, రాహుల్ చాహర్ ఓవర్లో భారీషాట్లు ఆడాడు. 33 బంతుల్లో 55వ అర్ధ శతకం బాదిన విరాట్ ఆ తర్వాత గేర్ మార్చాడు. ఎడాపెడా బౌండరీలు కొట్టాడు. అవతలి ఎండ్లోని కామెరూన్ గ్రీన్(46) సైతం బ్యాట్కు పని చెప్పాడు.
దాంతో, 17వ ఓవర్లకే ఆర్సీబీ స్కోర్ 200 దాటింది. ఈ క్రమంలో సెంచరీకి చేరువైన విరాట్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. అర్ష్దీప్ ఓవర్లో విరాట్ కొట్టిన బంతి నేరుగా బౌండరీ వద్ద ఉన్న రస్సో చేతుల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తిక్(18) సిక్సర్ల మీద సిక్సర్లు బాదేశాడు. అయితే.. ఆఖరి ఓవర్లో హర్షల్ పటేల్(3/38) మూడు వికెట్లు తీసి ఆర్సీబీ స్కోర్ 250 దాటకుండా చూశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.
భారీ లక్ష్య చేధనకు దిగిన పంజాబ్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. స్వప్నిల్ వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతికి ప్రభ్సిమ్రన్ సింగ్ (6) ఔటయ్యాడు. కానీ రోసో (61), బెయిర్ స్టో (27) దంచికొట్టారు. 5 ఓవర్లకే 61 పరుగులు సాధించారు. కానీ ఆరో ఓవర్లో ఐదో బంతికి డుప్లెసిస్కు క్యాచ్ బెయిర్స్టో పెవిలియన్కు చేరాడు. బెయిర్ స్టో ఔటయినప్పటికీ రోసోకు శశాంక్ సింగ్ (37 ) తోడయ్యాడు. దీంతో రోసో హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. కానీ 9వ ఓవర్లో రోసోకు కర్ణ్ శర్మ చెక్ పెట్టాడు. దీంతో పంజాబ్ కింగ్స్కు కష్టాలు మొదలయ్యాయి. పంజాబ్ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. 11వ ఓవర్లో జితేశ్ శర్మ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 12వ ఓవర్లో లివింగ్ స్టోన్ (0) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. 14వ ఓవర్లో శశాంక్ సింగ్ రనౌటయ్యాడు. ఇక 16 ఓవర్లో శామ్ కరన్ (22), ఆశుతోష్ (8) వికెట్లను చేజార్చుకోగా.. 17వ ఓవర్లో హర్షల్ పటేల్(0), అర్షదీప్ సింగ్ (4) ఔటయ్యారు. దీంతో 181 పరుగుల వద్దే పంజాబ్ ఆలౌట్గా నిలిచింది.