పంజాబ్ కింగ్స్..ఢిల్లీ క్యాపిటల్స్పై పంజా విసిరింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ అద్భుత విజయంతో లీగ్లో అదిరిపోయే బోణీ కొట్టింది. అర్ష్దీప్సింగ్, హర్షల్ పటేల్ రాణింపుతో ఢిల్లీ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో అభిషేక్ పోరెల్ వీరవిహారంతో ఢిల్లీ పరువు దక్కించుకుంది. లక్ష్యఛేదనలో ఆదిలోనే పంజాబ్ వికెట్లు కోల్పోయినా ఆల్రౌండర్ సామ్ కరన్ విజృంభణకు లివింగ్స్టోన్ జత కలువడంతో పంజాబ్ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న రిషబ్ పంత్ తిరిగి 14 నెలల తర్వాత పోటీకి దిగి తన సత్తాచాటాడు. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో తాను ప్రాణంగా ప్రేమించే క్రికెట్లోకి పంత్ పడిలేచిన కెరటంలా వచ్చాడు.
చండీగఢ్: ఐపీఎల్ డబుల్ ధమాకా తొలి పోరులో ఢిల్లీ క్యాపిటల్స్పై పంజాబ్ కింగ్స్దే పైచేయి అయ్యింది. శనివారం జరిగిన పోరులో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై అద్భుత విజ యం సాధించింది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. షాయి హోప్(33) టాప్ స్కోరర్గా నిలువగా, యువ క్రికెటర్ అభిషేక్ పోరెల్(10 బంతుల్లో 32 నాటౌట్, 4ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో ఢిల్లీ పోరాడే స్కోరు అందుకుంది. అర్ష్దీప్సింగ్ (2/28), హర్షల్ పటేల్ (2/47) రాణించారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు పంజా బ్.. సామ్ కరన్(47 బంతుల్లో 63, 6ఫోర్లు, సిక్స్) ధనాధన్ అర్ధసెంచరీకి తోడు లివింగ్స్టోన్ (38 నాటౌట్) రాణించడంతో 19.2 ఓవర్లలో 177/6 స్కోరు చేసింది. కుల్దీప్యాదవ్(2/20), ఖలీల్ అహ్మద్(2/43)రెండేసి వికెట్లు తీశారు. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన కరన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
కరన్ జోరు: కెప్టెన్ శిఖర్ ధవన్ (22) ఆది నుంచే దూకుడుగా ఆడే ప్రయ త్నం చేసినా.. జానీ బెయిర్స్టో (9) నిరాశపరిచాడు. ఇషాంత్శర్మ వేసిన ఇన్నిం గ్స్ 3వ ఓవర్లో ముందుకొచ్చి ఆడబోయిన ధవన్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. నాలుగు బంతుల తేడాతో బెయిర్స్టో అనూహ్యంగా రనౌట్ కావడంతో పంజాబ్ 42 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన ప్రభ్సిమ్రన్సింగ్(26), కరన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వచ్చి రావడంతోనే ప్రభ్సిమ్రన్ జోరు కనబరిచాడు. బౌండరీలతో స్కోరుబోర్డును పరిగెత్తిస్తున్న ప్రభ్స్రిమన్ను బౌలింగ్ మార్పుగా వచ్చిన కుల్దీప్ ఔట్ చేశాడు. ఆ తర్వాత జితేశ్(9) నిరాశపర్చడంతో పంజాబ్ 100 పరుగులకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా కరన్ బౌండరీలే లక్ష్యంగా జోరు కనబరిచాడు. మార్ష్ వేసిన 18వ ఓవర్లో కరన్ ఫోర్, సిక్స్తో చెలరేగితే..లివింగ్స్టోన్ సిక్స్ అరుసుకున్నాడు. అయితే ఖలీల్ 19వ ఓవర్లో వరుస బంతుల్లో కరన్తో పాటు శశాంక్సింగ్(0)ను ఔట్ చేసి గెలుపుపై ఆశలు రేపాడు. ఆఖర్లో లివింగ్స్టోన్ సిక్స్తో మ్యాచ్ను ముగించాడు.
రిషబ్ పంత్ 14 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ పంత్.. పలు కఠోరమైన ఫిట్నెస్ పరీక్షలను దాటుకుని తిరిగి క్రికెట్లోకి వచ్చాడు. గత ఐపీఎల్ సీజన్కు పూర్తిగా దూరమైన ఈ ఢిల్లీ కెప్టెన్.. పంజాబ్తో మ్యాచ్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. బ్యాటింగ్లో 18 పరుగులు చేసిన పంత్.. స్టంపింగ్తో పాటు క్యాచ్తో ఆకట్టుకున్నాడు.
ఢిల్లీ: 20 ఓవర్లలో 174/9(హోప్ 33, పోరెల్ 32 నాటౌట్, అర్ష్దీప్సింగ్ 2/28, హర్షల్పటేల్ 2/47),
పంజాబ్: 19.2 ఓవర్లలో 177/6(కరన్ 63, లివింగ్స్టోన్ 38 నాటౌట్, కుల్దీప్ 2/20, ఖలీల్ 2/43)