IPL 2024 Auction: రెండేండ్ల క్రితమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సీజన్లోనే దిగ్గజ టీమ్లను ఓడించి ఏకంగా ట్రోఫీ సొంతం చేసుకోవడమేగాక రెండోసారి కూడా ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్కు మరో షాక్ తప్పేట్టు లేదు. ఇదివరకే కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను కోల్పోయిన గుజరాత్.. మరో స్టార్ బౌలర్ మహ్మద్ షమీ కూడా ఆ జట్టుకు దూరమవనున్నాడనిపుకార్లు షికార్లు చేస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ సీఈవో కల్నల్ అర్విందర్ సింగ్ కూడా దీనిపై స్పందించడంతో షమీ జట్టును వీడటం ఖాయమే అనిపిస్తోంది.
అర్విందర్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. షమీని ఐపీఎల్లోని ఓ ఫ్రాంచైజీ వేలానికి ముందే ట్రేడ్ ద్వారా తీసుకునేందుకు యత్నించింది. సదరు ఫ్రాంచైజీ నేరుగా షమీ దగ్గరకు వెళ్లి తమ జట్టులోకి ఆహ్వానించింది. ఇందుకు భారీ మొత్తంలో ముట్టజెప్పేందుకు సిద్ధమైంది. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే గుజరాత్ అప్రమత్తమైంది. ఆటగాళ్ల బదిలీ ప్రక్రియకు ఇంకా అవకాశం ఉన్నప్పటికీ వారిని అప్రోచ్ అయ్యే విధానం మాత్రం ఇది కాదని అర్విందర్ తెలిపాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టులోని ఆటగాడిని ట్రేడ్ ద్వారా తీసుకోవాలనుకుంటే ముందుగా ఆ జట్టు యాజమాన్యాన్ని సంప్రదించాలి.
Which Franchise Can Request GT For Mohammed Shami ? pic.twitter.com/kEjRyGTTQe
— Junaid Khan (@JunaidKhanation) December 6, 2023
అయితే షమీని సంప్రదించిన టీమ్ ఏది..? అనేది మాత్రం అర్విందర్ వెల్లడించలేదు. అతడి బదిలీ కోసం తెరవెనుక జరిగిన మంత్రాంగం అయితే వాస్తవమేనని తెలిపాడు. దీనిపై గుజరాత్ టైటాన్స్ బీసీసీఐకి ఫిర్యాదు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. హార్ధిక్ పాండ్యా ట్రేడింగ్ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా జరగడంతో గుజరాత్కు ముంబై నుంచి భారీ మొత్తంలో దక్కింది. పాండ్యా వెళ్లిపోవడంతో గుజరాత్ తమ కొత్త సారథిగా శుభ్మన్ గిల్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.