IPL 2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ప్రపంచవ్యాప్తంగా జనాధరణ కలిగిన ఈ లీగ్లో ఒక్క సీజన్ అయినా ఆడాలని యువ క్రికెటర్లు పరితపిస్తుంటారు. ఐపీఎల్లో మెరిస్తే డబ్బుకు డబ్బు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు జాతీయ జట్టులో ఛాన్స్ దక్కడ బోనస్. అంతర్జాతీయ క్రికెటర్లు సైతం ఒక్క సీజన్ ఆడేందుకు నానా తంటాలు పడే ఈ లీగ్లో భారత్కు చెందిన ఏడుగురు క్రికెటర్లు మాత్రం ఈ లీగ్ మొదలైనప్పట్నుంచీ ప్రతీ సీజన్లో ఆడుతున్నారు. భారత దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనితో పాటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో అగ్రస్థానాన ఉండగా టీమిండియా రన్మిషీన్ విరాట్ కోహ్లీ ఒకే ఫ్రాంచైజీ తరఫున 17 సీజన్లుగా ఆడుతుండటం గమనార్హం.
2008లో మొదలైన ఈ క్యాష్ రిచ్ లీగ్లో నాటి నుంచి మరో రెండ్రోజుల్లో మొదలుకాబోయే సీజన్ వరకూ ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, మనీష్ పాండే, వృద్ధిమాన్ సాహాలు ఉన్నారు. ఈ ఏడుగురూ ఒక్క సీజన్ కూడా తప్పకుండా ప్రతి ఎడిషన్లోనూ ఆడారు. పైన పేర్కొన్నవారిలో కోహ్లీ తప్ప మిగిలినవారందరూ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించారు. కోహ్లీ 2008 నుంచి ఇప్పటివరకూ ఆర్సీబీ తరఫునే ఆడుతుండటం గమనార్హం. ఐపీఎల్లో ఒక్క ఫ్రాంచైజీ తరఫునే ఇన్ని సీజన్లు ఆడిన క్రికెటర్ అతడు మాత్రమే. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవిగో..
1. ధోని – 250 మ్యాచ్లు – చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్
2. రోహిత్ శర్మ – 243 – డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్
3. దినేశ్ కార్తీక్ – 237 – ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ లెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్
4. విరాట్ కోహ్లీ – 237 – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
5. శిఖర్ ధావన్ – 217 – ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ లెవన్ పంజాబ్
6. మనీష్ పాండే – 170 – ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్
7. వృద్ధిమాన్ సాహా – 161 – కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ లెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్
వీళ్లు కూడా.. కానీ..!
వీరితో పాటు పీయూష్ చావ్లా, రవీంద్ర జడేజా, రాబిన్ ఊతప్ప, అమిత్ మిశ్రాలు కూడా ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్నా ఈ నలుగురూ ఒక్కో సీజన్లో మిస్ అయ్యారు. చావ్లా 2022 సీజన్లో ఆడలేదు. జడేజా 2010లో ఊతప్ప 2023లో, అమిత్ మిశ్రా 2022లో దూరమయ్యారు. భారత టెస్టు ఆటగాడు అజింక్యా రహానే కూడా ప్రతి సీజన్లో ఆడకపోయినా అతడు మాత్రం ప్రతి ఎడిషన్లోనూ ఆయా జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. అశ్విన్, ఇషాంత్ శర్మలు కూడా ప్రతి ఎడిషన్లో సభ్యులుగా కొనసాగారు.