IPL 2024, Bangalore Water Crisis | కర్నాటక రాజధాని బెంగళూరులో నీటి కొరత కారణంగా నగరంలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సి ఉన్న ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కష్టమేనని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాగునీరు దొరకక జనం ఇబ్బందులు పడుతున్న తరుణంలో మ్యాచ్ నిర్వహణకు వేలాది లీటర్ల నీటిని ఎక్కడ్నుంచి తీసుకొస్తారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ.. అసలు బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) హోంమ్యాచ్లు ఆడుతుందా..? లేదా..? అన్నది ఆ జట్టు అభిమానులను వేధిస్తున్నది. ఈ నేపథ్యంలో కర్నాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) స్పందించింది. బెంగళూరులో నీటి సమస్య ఉన్నా చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు నిర్వహిస్తామని తెలిపింది.
ఈ మేరకు కేఎస్సీఏ సీఈవో సుబేంధు ఘోష్ పీటీఐతో మాట్లాడుతూ… ‘మాకు నీటి కొరత ఏమీ లేదు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలను మేం అనుసరిస్తాం. పిచ్, ఔట్ ఫీల్డ్ నిర్వహణతో పాటు ఇతర అవసరాలకు మాకు ఒక మ్యాచ్కు 10 వేల నుంచి 15 వేల నీటి లీటర్లు అవసరం. అందుకు గాను మాకు సొంతంగా ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) కూడా ఉంది. మేం దాని నుంచే నీటి నిర్వహణ చేస్తున్నాం. మాకు గ్రౌండ్ వాటర్ అవసరం లేదు..’ అని అన్నాడు.
బెంగళూరులో నీటి కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు. నీటి వృథాను అరికట్టాలని.. కార్లు, బైకులను కడగొద్దని, వంట పాత్రలకు ఎక్కువగా నీటిని వినియోగించొద్దని స్వయంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చెబుతున్నారు. 20 లీటర్ల వాటర్ క్యాన్కు అక్కడ రూ. 200 నుంచి రూ. 300 దాకా ఖర్చు అవుతోంది. ఇక సాధారణ రోజుల్లో రూ. 700- రూ. 800 వరకు ఉండే వాటర్ ట్యాంకర్.. కొన్నికొన్ని ప్రాంతాల్లో రూ. 2 వేల నుంచి రూ. 3 వేల దాకా వెచ్చించినా దొరకడం లేదు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకోగా తొలి విడత మ్యాచ్లకు వచ్చిన నష్టమైతే ఏమీ లేదని కేఎస్సీఏ తెలిపింది.
𝐓𝐇𝐈𝐒 𝐈𝐒 𝐈𝐓 🤩
For every role, we’ve found our match
And we believe they can hit the Purple Patch!
Signed today or retained before,
This is our #𝗖𝗹𝗮𝘀𝘀𝗢𝗳𝟮𝟬𝟮𝟰#PlayBold #BidForBold #IPLAuction #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/5bskDt4eGa— Royal Challengers Bangalore (@RCBTweets) December 19, 2023
తొలి విడత ఐపీఎల్ షెడ్యూల్లో భాగంగా ఆర్సీబీ.. హోంగ్రౌండ్లో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ నెల 24, 29, ఏప్రిల్ 02న ఆర్సీబీ.. మ్యాచ్లు ఆడనుంది. ఈ మ్యాచ్ల వరకూ మమ అనిపించినా రెండో షెడ్యూల్ నాటికి (ఏప్రిల్ 15 తర్వాత) ఎండాకాలం కూడా పీక్స్కు చేరితే అప్పుడు బెంగళూరుకు మరింత బెంగ తప్పేలా లేదు.