IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2024లో భాగంగా కీలకమైన వేలం ప్రక్రియను డిసెంబర్ 19న నిర్వహించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు ఐపీఎల్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి వేలం ప్రక్రియ భారత్ ఆవల జరుగనుండటం గమనార్హం. దుబాయ్ వేదికగా ఐపీఎల్ ఆక్షన్ను ఈ నెల 19న నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.
గత నెలలో ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియ అనంతరం 1,166 మంది ఆటగాళ్లు వేలంలో రిజిష్టర్ చేసుకున్నారు. వీరిలో వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ నుంచి ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్ వంటి ఆటగాళ్లపై భారీ ఆశలున్నాయి. న్యూజిలాండ్ రచిన్ రవీంద్రతో పాటు డారెల్ మిచెల్ కూడా భారీ ధర దక్కించుకుంటారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వేలానికి పేరు నమోదుచేసుకున్నవారిలో 830 మంది భారత ఆటగాళ్లు కాగా 336 మంది ఓవర్సీస్ ప్లేయర్లున్నారు.