ఐపీఎల్లోని 1000వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 212 పరుగుల టార్గెట్ని 4 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలి ఉండగానే ముంబై గెలుపొందింది.
ముంబై తరుపున టిమ్ డేవిడ్ 45 (14 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లు) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాద్ 55 (29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు), కామెరూన్ గ్రీన్ 44 (26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) మంచి షాట్లతో అభిమానులకు కనువిందు చేశారు. ముంబై విజయంతో రాజస్థాన్ ఆటగాడు యశస్వి జైస్వాల్124 ( 62 బంతుల్లో, 16 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు) సూపర్ సెంచరీ చేసినా ఫలితం లభించలేదు.
వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో గెలవడంతో అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చింది. రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటయ్యాడు. అలాగే ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ కీలక సమయంలో అవుటైనా టిమ్ డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్ల మోత మోగించి మ్యాచ్ని ముగించడం కొసమెరుపు.
ఈ సీజన్లో పేలవ ఫామ్ని కొనసాగించిన రోహిత్ శర్మ 5 బంతుల్లో 3 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.
అంతకుముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) వీర ఉతుకుడుతో ముంబై (MI) బౌలర్ల భరతం పట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 53 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ బాదిన జైస్వాల్ ఆ తర్వాత మరో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. మొత్తంగా 62 బంతులు ఆడిన జైస్వాల్ 124 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుటయ్యాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. రాజస్థాన్ ఆటగాళ్లలో జోస్ బట్లర్ 18, కెప్టెన్ సంజు శాంసన్ 14, హోల్డర్ 11 పరుగులు చేశారు. పడిక్కల్, హెట్మెయిర్, జురెల్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఫలితంగా రాజస్థాన్ (Rajasthan Royals) 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్కు మూడు, పీయూష్ చావ్లాకు రెండు వికెట్లు దక్కాయి.