నిరుడు ఐపీఎల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్ సొంతగడ్డపై ఆడిన తొలి పోరులో అదరిపోయే బోణీ కొట్టింది. విండీస్ ఆటగాళ్ల అండతో భారీ స్కోరు చేసిన లక్నో.. అనంతరం బౌలింగ్లోనూ సత్తాచాటింది. బ్యాటింగ్లో కరీబియన్ వీరులు మయేర్స్, పూరన్ దంచికొడితే.. బంతితో మార్క్ వుడ్ ఢిల్లీని బెంబేలెత్తించాడు.
లక్నో: గత సీజన్లో కొత్తగా ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్.. సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్లో విజృంభించింది. శనివారం జరిగిన రెండో పోరులో లక్నో 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కైల్ మయేర్స్ (38 బంతుల్లో 73; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్తో చెలరేగగా.. ఆఖర్లో నికోలస్ పూరన్ (21 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆయుష్ బదోని (7 బంతుల్లో 18; ఒక ఫోర్, 2 సిక్సర్లు) దంచికొట్టారు.
ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఇంపాక్ట్ ప్లేయర్గా క్రీజులోకి అడుగుపెట్టిన కృష్ణప్ప గౌతమ్ భారీ సిక్సర్తో అలరించాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులకు పరిమితమైంది. మార్క్ వుడ్ (5/14) ధాటికి పృథ్వీ షా (12), మిషెల్ మార్ష్ (0), సర్ఫరాజ్ ఖాన్ (4) విఫలంకాగా.. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (48 బంతుల్లో 56; 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. రిలీ రొసో (30) రాణించాడు. లక్నో బౌలర్లలో వుడ్ 5 వికెట్లతో అదుర్స్ అనిపించుకోగా.. రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వుడ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. లీగ్లో ఆదివారం కూడా డబుల్ హెడర్ జరుగనుంది.
లక్నో: 193/6 (మయేర్స్ 73, పూరన్ 36; ఖలీల్ 2/30, చేతన్ సకారియా 2/53), ఢిల్లీ: 20 ఓవర్లలో 143/9 (వార్నర్ 56, రొసో 30; వుడ్ 5/14, అవేశ్ 2/29).