కొన్నిరోజుల క్రితం జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అత్యంత భారీ ధరకు సొంతం చేసుకున్న విదేశీ ఆటగాడు నికోలస్ పూరన్. ఫామ్లో లేని ఈ విండీస్ వికెట్ కీపర్ కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఏకంగా రూ.10.75 కోట్లు ఖర్చు చేసింది. ఇది చూసిన చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ నిర్ణయం సరైనదేనా? అని సందేహాలు వ్యక్తమయ్యాయి.
పూరన్ను కొనుగోలు చేయడం వెనక ఉన్న కారణాన్ని సన్రైజర్స్ మేనేజ్మెంట్ సభ్యుడు, శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ వెల్లడించాడు. తాము ముందుగా ఇషాన్ కిషన్ను కొనుగోలు చేయాలని అనుకున్నామని మురళీధరన్ చెప్పాడు. ‘ఇషాన్ కిషన్ను ఎలాగైనా జట్టులోకి తీసుకోవాలని అనుకున్నాం. కానీ ముంబై జట్టు భారీ ధరకు అతన్ని కొనుగోలు చేసింది. ఆ ధర మా బడ్జెడ్ దాటేసింది. దాంతో మరో వికెట్ కీపర్ బ్యాటర్ కావాలని అనుకున్నాం’ అని ఈ వెటరన్ స్పిన్నర్ చెప్పాడు.
జట్టులో జానీ బెయిర్స్టో ఉన్నాడని, కానీ అతను సీజన్ అంతా ఉంటాడో? ఉండడో? అనే అనుమానం తమకు ఉందన్నాడు. అందుకే సీజన్ మొత్తం జట్టుతో ఉండే అంతర్జాతీయ వికెట్ కీపర్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ తర్వాత నికోలస్ పూరన్కు ఓటేశామని వివరించాడు. అతని ఫామ్పై పాజిటివ్గా ఉన్నామని చెప్పిన మురళీధరన్.. పూరన్ అంత ధర పలికాడంటే మిగతా జట్లు కూడా అతన్ని కావాలని అనుకున్నట్లే కదా అని స్పష్టం చేశాడు.
కాగా, గత ఐపీఎల్లో పూరన్ చాలా పేలవ ప్రదర్శన కనబరిచాడు. 12 మ్యాచుల్లో ఆడిన అతను కేవలం 85 పరుగులు మాత్రమే చేశాడు. అయితే భారత్తో జరిగిన టీ20 సిరీస్లో మంచి స్కోర్లు చేశాడు. దీంతో వచ్చే ఐపీఎల్లో కూడా అతను మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇషాన్ కిషన్ విషయానికొస్తే.. అతన్ని ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా రూ.15.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Our new Caribbean Riser is realising his star potential 🧡@nicholas_47 #OrangeArmy #ReadyToRiser #IPL pic.twitter.com/KgQlAPUa0g
— SunRisers Hyderabad (@SunRisers) February 21, 2022