Layoffs | న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు టెక్ రంగంలో ఉద్యోగాల కోల్పోయిన వారి సంఖ్య 70 వేలు దాటింది. ఉద్యోగులను తీసేసిన సంస్థల జాబితాలో టెక్ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్, యాపిల్, ఇంటెల్, టెస్లా వంటి సంస్థలు ఉన్నాయి. ఎలాన్ మస్క్కు చెందిన కార్ల తయారీ సంస్థ టెస్లా పలు విభాగాల్లోని వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసింది. అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో ఖర్చులను అదుపులో ఉంచుకోనేందుకు ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగులను తొలగించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ చర్య చేపట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
యాపిల్లో స్పెషల్ ప్రాజెక్టు గ్రూపులోని 614 మంది ఫైర్ అయ్యారు. వీరిలో కొంత మంది ప్రస్తుతం రద్దయిన సెల్ఫ్-డ్రైవింగ్ కారు ప్రాజెక్టుకు చెందిన వారు. పైథాన్, ఫ్లుట్టర్, డార్ట్లపై పనిచేసే బృందాల్లోని చాలా మంది ఉద్యోగులను గూగుల్ కంపెనీ తొలగించింది. వారికి కంపెనీలోనే ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించామని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ డివిజన్లో అమెజాన్ వందలాది మందిని తొలగించింది. ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ దాదాపు 500 మందిపై వేటు వేసింది. ఇంకా ఇంటెల్, ఓలా క్యాబ్స్, హెల్తిఫై, టెలినార్ వంటి సంస్థలు గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు తొలగింపు చేపట్టాయి.
అమెరికా హెచ్-1బీ వీసా లాటరీ కోసం ఈ ఏడాది దాదాపు 40 శాతం తక్కువ దరఖాస్తులు వచ్చాయని యూఎస్ సిటిజన్షిప్ ఆండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) వెల్లడించింది. 2023 లో 7,58,994 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 4,79,342 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపింది. కాగా, దరఖాస్తు చేసిన ఉద్యోగాల సంఖ్య మాత్రం దాదాపుగా గత ఏడాదితో సమానంగా ఉంది.
ఇంతకుముందు హెచ్-1బీ లాటరీ కోసం మాన్యువల్గా దరఖాస్తు చేసుకునే పద్ధతి ఉండేది. తర్వాత ఎలక్ట్రానిక్ పద్ధతిని ప్రవేశపెట్టారు. అయితే, కొన్ని కంపెనీలు, వ్యక్తులు ఈ పద్ధతిని దుర్వినియోగం చేసి డుప్లికేట్ దరఖాస్తులు చేస్తున్నారని యూఎస్సీఐఎస్ గుర్తించింది. దీంతో ఈసారి ఒక్కరు ఒకే దరఖాస్తు చేసే విధానాన్ని అమలు చేసింది. దీంతో దరఖాస్తులు భారీగా తగ్గినట్టు భావిస్తున్నారు.