ఖమ్మం సిటీ: ఖమ్మం మరోసారి అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు వేదికగా మారనుంది. ఐటీసీఎఫ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఆల్ఇండియా టీ20 క్రికెట్ టోర్నీ జరుగుతుందని కేపీఎల్ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ ప్రకటించారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా టోర్నీ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే శ్రీలంక, నేపాల్ దేశాలతో పాటు రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, జమ్ము కశ్మీర్ రాష్ర్టాలతో కలిపి స్థానిక రెండు జట్లకు చెందిన ప్లేయర్లు తలపడుతారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే మహిళా టీ20 పోటీలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించామన్నారు. వరుసగా నాలుగు దఫాలు ప్రతిష్ఠాత్మక టోర్నీలు నిర్వహించిన ఘనత తమకే దక్కుతుందని డాక్టర్ ప్రదీప్ పేర్కొన్నారు. చాంపియన్షిప్నకు సంబంధించి అన్నిరకాల ఏర్పాట్లు చేశామని ఫెడరేషన్ డైరెక్టర్లు సందీప్ ఆర్య, నరేశ్, సహాయకులు వీర్ల రవి, భవర్ గుర్జార్, స్పోర్ట్స్ ఎవెన్యూ నసీమ్, మోసిన్, కోచ్ మతిన్ స్పష్టం చేశారు.