ICC | డర్బన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రైజ్మనీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఈవెంట్లలో పురుషుల జట్లకు, మహిళల జట్లకు సమానమైన ప్రైజ్మనీ ఇవ్వాలని నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్లో జరిగిన వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
దీంతో ఇకపై మహిళల వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్లలో విజేతగా నిలిచిన జట్టు.. పురుషులతో సమానంగా ప్రైజ్మనీ అందుకోనుంది. ‘పురుషుల, మహిళల జట్లకు సమాన ప్రైజ్మనీ ఇవ్వాలని నిర్ణయించాం. సమాన పనికి సమాన వేతనంగా.. విజేతలకు ప్రైజ్మనీ కూడా సమంగా అందుతుంది’ అని ఐసీసీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.