INDvsSA: ‘మేము ఇంతవరకూ ఎవరూ సాధించలేనిది సాధించాలనే లక్ష్యంతో ఉన్నాం..’ అంటూ టీమిండియా సారథి రోహిత్ శర్మ తొలి టెస్టుకు ముందు విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రోహిత్ చెప్పినట్టుగానే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి అగ్రశ్రేణి జట్లను వారి స్వదేశాల్లోనే మట్టికరిపించి చారిత్రాత్మక విజయాలు సాధించిన మెన్ ఇన్ బ్లూ.. ఇంతవరకూ సౌతాఫ్రికా గడ్డమీద టెస్టు సిరీస్ నెగ్గలేదు. 1992 నుంచి ఇప్పటివరకూ ఎనిమిది సార్లు సఫారీ గడ్డమీద టెస్టు సిరీస్లు ఆడినా ఒక్కటంటే ఒక్క సిరీస్ను కూడా గెలుచుకోలేకపోయింది.
దక్షిణాఫ్రికాపై ఐసీసీ నిషేధం ఎత్తేసిన తర్వాత 1992-93 లో మొదటిసారిగా భారత్.. సఫారీ టూర్కు వెళ్లింది. మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో దక్షిణాఫ్రికా వెళ్లిన భారత్.. నాలుగు టెస్టుమ్యాచ్ల సిరీస్ను 0-1 తేడాతో ఓడిపోయింది. 1996-97 పర్యటనలో మూడు టెస్టులు జరగ్గా రెండింట సఫారీలదే విజయం. 2000-01లో రెండు టెస్టులలో ప్రోటీస్ జట్టే ఒక మ్యాచ్ గెలిచి సిరీస్ నెగ్గింది.
2006-07లో మూడు మ్యాచ్ల సిరీస్ కోసం భారత్.. సఫారీ టూర్కు వెళ్లగా 2-1 తేడాతో పరాభవం తప్పలేదు. కానీ దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తొలి విజయం సాధించింది ఈ సిరీస్లోనే.. జోహన్నస్బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 123 పరుగుల తేడాతో గెలిచింది. కాఈన తర్వాత రెండు మ్యాచ్లూ ఓడింది. 2010-11లో ధోని సారథ్యంలో దక్షిణాఫ్రికాకు వెళ్లిన భారత్.. మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది. 2013-14 పర్యటనలో రెండు మ్యాచ్ల సిరీస్ను సఫారీలు 1-0 తేడాతో గెలుచుకున్నారు.
2017-18లో విరాట్ కోహ్లీ సారథ్యంలో దక్షిణాఫ్రికాకు వెళ్లిన భారత్.. మూడు మ్యాచ్ల సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయింది. 2021-22లో కూడా మూడు మ్యాచ్ల సిరీస్లో సఫారీలే రెండు గెలిచి సిరీస్ను సొంతం చేసుకున్నారు. మొత్తంగా సఫారీ గడ్డపై ఇప్పటివరకూ 23 టెస్టులు ఆడిన భారత్.. నాలుగు మ్యాచ్లు మాత్రమే గెలిచింది. తాజా సిరీస్లో భారత్ రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మరి ఈసారైనా రోహిత్ సేన.. మూడు దశాబ్దాల కలను నెరవేర్చుతుందో చూడాలి..