INDvsSA 1st Test: భారత్-దక్షిణాఫ్రికా మధ్య సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. మొదటి టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా టాస్కు ముందు ఓసారి వర్షం కురవగా తాజాగా టీ తర్వాత మరోసారి వరుణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్.. 59 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ (105 బంతుల్లో 70 నాటౌట్, 10 ఫోర్లు, 2 సిక్సర్లు), సిరాజ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సఫారీ పేసర్ ఐదు వికెట్లతో విజృంభించడంతో భారత టాపార్డర్ విఫలమైంది.
టీ విరామానికి 40 పరుగులతో ఉన్న రాహుల్.. బర్గర్ వేసిన 52వ ఓవర్లో ఫోర్, సిక్సర్ బాది అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19 బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేసిన బుమ్రాను మార్కో జాన్సెన్.. 55వ ఓవర్లో మూడో బంతికి ఔట్ చేశాడు. గెరాల్డ్ కొయెట్జ్ వేసిన 58వ ఓవర్లో రాహుల్.. వరుసగా రెండు బౌండరీలు బాదాడు. దీంతో భారత స్కోరు 200 పరుగుల మార్కును దాటింది. జాన్సెన్ వేసిన 59వ ఓవర్లో ఐదో బంతికి బౌండరీ కొట్టడంతో అతడు 70లలోకి వచ్చాడు. అయితే అదే ఓవర్లో వర్షం కురవడం మొదలైంది. దీంతో అంపైర్లు ఆటను తాత్కాలికంగా వాయిదా వేశారు.
ముగిసిన తొలి రోజు ఆట..
టీ విరామం తర్వాత 9 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా వర్షం కురవడంతో పాటు వెలుతురు సరిగా లేకపోవడంతో అంపైర్లు తొలి రోజు ఆటను నిలిపేశారు. మొదటి రోజు 59 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. భారత టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (5), యశస్వి జైస్వాల్ (17), శుభ్మన్ గిల్ (2)లు దారుణంగా విఫలం కాగా విరాట్ కోహ్లీ (38), శ్రేయస్ అయ్యర్ (31)లు ఫర్వాలేదనిపించారు. శార్దూల్ ఠాకూర్ (24) తనవంతు చేయి వేశాడు. కెఎల్ రాహుల్ నిలదొక్కుకోవడంతో భారత్ 200 పరుగులైనా చేయగలిగింది.