INDvsNZ: వాంఖడేలో భారత్ నిర్దేశించిన 398 పరుగుల ఛేదనలో కివీస్ దూకుడుగా ఆడుతోంది. కివీస్ మిడిలార్డర్ బ్యాటర్ డారెల్ మిచెల్ వీరబాదుడు బాదుతుండటంతో కొండంత లక్ష్యం కూడా కరిగిపోతున్న తరుణంలో టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి మాయ చేశాడు. వరుసగా రెండు వికెట్లు తీసి కివీస్ను ఒత్తిడిలోకి నెట్టాడు. కేన్ విలిమయ్సన్తో పాటు టామ్ లాథమ్ కూడా ఔట్ అవడంతో భారత శిబిరంలో మళ్లీ ఆశలు చిగురించాయి
మిచెల్ సెంచరీ..
మిడిల్ ఓవర్స్లో భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఓవర్కు సిక్సర్, ఫోర్కు తగ్గకుండా బాదుతున్న మిచెల్..85 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకుని భారత అభిమానుల గుండెల్లో భయాన్ని నింపాడు.
షమీ క్యాచ్ మిస్.. కానీ మళ్లీ అతడే..
స్పిన్నర్లు తేలిపోతుండటంతో రోహిత్ 30వ ఓవర్లో బుమ్రాకు బంతినిచ్చాడు. ఆ ఓవర్లో ఐదో బంతికి విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్ను షమీ నేలపాలు చేశాడు. క్రీజులో కుదురుకునేదాకా కాస్త నెమ్మదిగా ఆడిన కేన్ మామ కూడా ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. అయితే డ్రింక్స్ తర్వాత రెండో ఓవర్ వేసిన షమీ.. కేన్ మామను ఔట్ చేశాడు. అతడు వేసిన 33వ ఓవర్లో మూడో బంతికి విలియమ్సన్.. భారీ షాట్ ఆడోయి బౌండరీ లైన్ వద్ద ఉన్న సూర్యకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్కు భాగస్వామ్యానికి తెరపడింది. ఈ ఇద్దరూ 149 బంతుల్లోనే 181 పరుగులు జోడించారు. అయితే కేన్ మామ నిష్క్రమించిన తర్వాత రెండో బంతికే షమీ భారత్కు మరో బ్రేక్ ఇచ్చాడు. టామ్ లాథమ్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆ జట్టు నాలుగో వికెట్ కూడా కోల్పోయింది. 34 ఓవర్లు ముగిసేసరికి కివీస్.. నాలుగు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. మిచెల్ (101 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (0 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.