INDvsNZ: ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 398 పరుగుల ఛేదనలో ఆదిలో తడబడ్డా కివీస్ నెమ్మదిగా కుదురకుంటోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు డారెల్ మిచెల్లు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటున్నారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం ఇదివరకే వంద పరుగులు దాటింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్రలను త్వరగానే ఔట్ చేసిన భారత్.. తర్వాత వికెట్ కోసం శ్రమిస్తోంది. పేసర్లతో పాటు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు కూడా వికెట్లు తీయలేకపోతున్నారు.
39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన కేన్ మామ.. మిచెల్తో కలిసి ఇన్నింగ్స్ను పునర్నిర్మించే పనిలోపడ్డాడు. సిరాజ్ వేసిన 11వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన మిచెల్.. తర్వాత వేసిన జడేజా ఓవర్లో కూడా రెండు బౌండరీలు సాధించాడు. సిరాజ్ వేసిన 13వ ఓవర్లో ఓ బౌండరీతో పాటు బైస్ రూపంలో మరో బౌండరీ వచ్చింది. అతడే వేసిన 15వ ఓవర్లో కేన్ మామ 6, 4 బాదాడు.
షమీ వేసిన 17వ ఓవర్లో మిచెల్ కూడా 6, 4 కొట్టడంతో కివీస్ స్కోరు వంద దాటింది. జడేజాతో పాటు కుల్దీప్ కూడా వికెట్లు తీయడంలో తంటాలుపడుతున్నాడు. మరోవైపు మిచెల్.. జడేజా వేసిన 23వ ఓవర్లో సింగిల్ తీసి అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ వరల్డ్ కప్లో అతడికి ఇది నాలుగో హాఫ్ సెంచరీ. ఇక కుల్దీప్ వేసిన 26వ మూడో బంతిని లాంగాన్ దిశగా సింగిల్ తీసిన కివీస్ సారథి కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ ఇద్దరి దూకుడుతో 26 ఓవర్లు ముగిసేసరికి కివీస్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 165 పరుగులు చేసింది. మిచెల్ ( 64నాటౌట్), విలియమ్సన్ (50 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.