INDvsENG: స్వదేశంలో మరో రెండు వారాల్లో అగ్రశ్రేణి క్రికెట్ జట్టు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడబోతున్న టీమిండియాకు భారీ షాక్ తప్పేలా లేదు. భారత జట్టు స్టార్ పేసర్, వన్డే వరల్డ్ కప్లో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన మహ్మద్ షమీ.. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం అనుమానమేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాల ద్వారా తెలుస్తున్నది. వరల్డ్ కప్లో గాయపడ్డ షమీ ఆ టోర్నీ ముగిసిన తర్వాత విరామం తీసుకుంటున్నాడు. అతడు ఇంతవరకూ మళ్లీ బంతిని పట్టనేలేదని సమాచారం.
ప్రపంచకప్ ముగిసిన తర్వాత షమీ.. ఫిట్నెస్ లేమితో దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడు ఇంకా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో కూడా రిపోర్ట్ చేయలేదని సమాచారం. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్ తర్వాత షమీ మళ్లీ బౌలింగ్ చేయడం మొదలుపెట్టలేదు. అతడింకా ఎన్సీఏకు వెళ్లి నిరూపించుకోవాల్సి ఉంది. ఇంగ్లండ్తో జరుగబోయే తొలి రెండు టెస్టులు అతడు ఆడేది అనుమానమే..’ అని అన్నాడు. ఇంగ్లండ్తో భారత జట్టు.. జనవరి 25న హైదరాబాద్ వేదికగా జరుగబోయే టెస్టుతో సిరీస్ మొదలుపెట్టనుంది. రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా జరుగుతుంది.
Injury updates of Indian team. [Express Sports]
– Mohammed Shami likely to miss first 2 Tests against England.
– Suryakumar Yadav set to undergo Hernia Surgery, recovery process is 8 to 9 weeks, likely to be fit for IPL. pic.twitter.com/Gdg3onAUpP
— Johns. (@CricCrazyJohns) January 8, 2024
షమీ కథ ఇలా ఉంటే టీ20లలో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ అయిన సూర్యకుమార్ యాదవ్ కూడా అఫ్గాన్తో టీ20 సిరీస్తో పాటు ఇంగ్లండ్తో టెస్టులకు దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో సిరీస్లో అతడు గాయపడ్డాడు. త్వరలోనే సూర్య హెర్నియా ఆపరేషన్ చేయించుకోనున్నాడు. అది ముగిసిన తర్వాత ఐపీఎల్ ప్రారంభం వరకు ఫిట్ అవుతాడని, మెగా టోర్నీలో ఆడతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.