England Squad: వచ్చే నెల భారత్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన ఈ జట్టులో ఇంగ్లండ్.. ఏకంగా నలుగురు స్పిన్నర్లతో రాబోతుంది. ఇందులో ఇద్దరు ఇంతవరకూ ఆడని అన్క్యాప్డ్ స్పిన్నర్లు టామ్ హార్ట్లీ, షోయభ్ బాషిర్ ఉన్నారు. ఉపఖండపు పిచ్లపై స్పిన్నర్ల ప్రభావం ఎక్కువుండటంతో ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా భారత్ను స్పిన్ తోనే బంధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు నలుగురు ఫాస్ట్ బౌలర్లు, నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగబోతోంది. కొద్దిరోజుల క్రితమే ముగిసిన యాషెస్ సిరీస్లో రాణించిన క్రిస్ వోక్స్ను ఈ సిరీస్ లో పక్కనబెట్టింది.
స్టోక్స్ సారథ్యంలోని ఈ జట్టులో హార్ట్లీ, బాషిర్లతో పాటు యాషెస్ సిరీస్కు గాయం కారణంగా మిస్ అయిన జాక్ లీచ్, రిహాన్ అహ్మద్ కూడా ఎంపికయ్యారు. భారత్తో సిరీస్ నేపథ్యంలో హార్ట్లీ, బాషిర్లు నెల రోజుల క్రితం యూఏఈలో ప్రత్యేక శిక్షణ పొందారు. రిహాన్ అహ్మద్ గతేడాది పాకిస్తాన్తో జరిగిన టెస్టు సిరీస్లో రాణించాడు. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్తో పాటు రాబిన్సన్, అట్కిన్సన్, మార్క్ వుడ్లు పేస్ బాధ్యతలు మోయనున్నారు. యాషెస్ సిరీస్లో చోటు దక్కించుకోలేకపోయిన వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ భారత్తో టూర్కు ఎంపికయ్యాడు.
ఇంగ్లండ్ జట్టు భారత్లో చివరిసారిగా 2012-13లో టెస్టు సిరీస్ నెగ్గింది. దశాబ్దకాలంగా ఆ జట్టు ఇక్కడ టెస్టులలో సిరీస్ గెలవలేదు. బజ్బాల్ ఆటతో స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్కు స్పిన్ ట్రాక్లు ఉండే భారత్లో అసలైన సవాల్ ఎదురుకానుంది. భారత్-ఇంగ్లండ్ మధ్య జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా మొదలుకాబోయే టెస్టు సిరీస్.. మార్చి 7న ధర్మశాలలో ఐదో టెస్టుతో ముగియనుంది.
We have announced our 16-player Test squad to tour India! 🏏
Click below to see the squad 📝👇
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket
— England Cricket (@englandcricket) December 11, 2023
భారత్తో సిరీస్కు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రిహాన్ అహ్మద్, జేమ్స్ అండర్సన్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్ స్టో, షోయబ్ బాషిర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒలి పోప్, ఒలి రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్