IND vs AFG 1st T20I: దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకున్న టీమిండియా.. స్వదేశంలో మళ్లీ టీ20 మోడ్లోకి వచ్చింది. అఫ్గానిస్తాన్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు పంజాబ్లోని మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో బరిలోకి దిగుతోంది. 14 నెలల తర్వాత పొట్టి క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ తిరిగి ఈ ఫార్మాట్లో సారథ్య బాధ్యతలు చేపట్టనుండటంతో ఈ సిరీస్ మరింత ఆసక్తికరంగా మారింది. మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. అఫ్గానిస్తాన్ బ్యాటింగ్ చేయనున్నది. టీ20 వరల్డ్ కప్ ముందు భారత్ ఆడనున్న చివరి టీ20 సిరీస్ ఇదే.
ఈ మ్యాచ్లో భారత్కు కీలక ఆటగాళ్లు మిస్ అయ్యారు. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ నుంచి దూరమవగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్తో పాటు అవేశ్ ఖాన్, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్లూ ఈ మ్యాచ్ ఆడటం లేదు. వికెట్ కీపర్గా శాంసన్ స్థానంలో జితేశ్ శర్మకు ఛాన్స్ ఇచ్చింది టీమ్ మేనేజ్మెంట్. స్పిన్ బాధ్యతలను రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ మోయనున్నారు. రోహిత్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేయనున్నాడు. తుది జట్టులో శివమ్ దూబేకు చోటు కల్పించడం గమనార్హం.
ఇక రషీద్ ఖాన్ వంటి స్టార్ ప్లేయర్ లేకున్నా భారత్తో ఐపీఎల్లో ఆడిన అనుభవం మెండుగా ఉన్న అఫ్గాన్ కీలక ప్లేయర్లను లైట్ తీసుకుంటే భారత్కు తిప్పలు తప్పవు. ఇటీవలే భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్లో అఫ్గాన్.. పాకిస్తాన్, ఇంగ్లండ్, శ్రీలంకలకు షాకిచ్చింది. ఆస్ట్రేలియాను ఓడించినంత పనిచేసింది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేశ్ కుమార్
అఫ్గానిస్తాన్ : రెహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మత్ షా, అజ్మతుల్లా ఓమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీమ్ జన్నత్, గుల్బాదిన్ నయీబ్, ఫజల్హక్ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్