INDvsAFG 2nd T20I: భారత్-అఫ్గాన్ మధ్య ఇండోర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్.. భారత్ ఎదుట పోరాడగలిగే లక్ష్యాన్ని నిలిపింది. అఫ్గాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టినా గుల్బాదిన్ నయీబ్ (35 బంతుల్లో 57, 5 ఫోర్లు, 4 సిక్సర్లు), నజీబుల్లా జద్రాన్ (21 బంతుల్లో 23, 1 ఫోర్), కరీమ్ జనత్ (10 బంతుల్లో 20, 2 ఫోర్లు, 1 సిక్సర్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (9 బంతుల్లో 21, 2 పోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆరంభ ఓవర్లలో అఫ్గాన్ను కట్టడి చేసి వికెట్లు తీసినా కీలక సమయంలో భారత బౌలర్లు పరుగులు సమర్పించుకున్నారు. అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు (32/3), అక్షర్ పటేల్ (17/2) రాణించారు. బిష్ణోయ్ (39/2) , శివమ్ దూబే (17/1) లు ఫర్వాలేదనింపించారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన అఫ్గానిస్తాన్కు మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. వికెట్కీపర్ బ్యాటర్ అయిన ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ (14)ను బిష్ణోయ్.. మూడో ఓవర్లో రెండో బంతికి ఔట్ చేశాడు. 20 పరుగులకే ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్లలో అక్షర్, దూబేలు అఫ్గాన్కు డబుల్ స్ట్రోక్లు ఇచ్చారు. అక్షర్ వేసిన ఆరో ఓవర్లో నాలుగో బంతికి అఫ్గాన్ సారథి ఇబ్రహీం జద్రాన్ (8) బౌల్డ్ అవగా అజ్మతుల్లా (2)ను ఆ మరుసటి ఓవర్లోనే దూబే పెవిలియన్కు పంపాడు. దీంతో అఫ్గాన్ 60 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
గుల్బాదిన్ బాదుడు..
వన్డౌన్లో వచ్చిన గుల్బాదిన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. రవి బిష్ణోయ్ వేసిన 5వ ఓవర్లో 6, 6, 4 తో చెలరేగిన అతడు.. దూబే వేసిన 9వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. అక్షర్ వేసిన 10వ ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీయడం ద్వారా 28 బంతుల్లోనే అతడి అర్థ సెంచరీ పూర్తయింది. హాఫ్ సెంచరీ తర్వాత వాషింగ్టన్ సుందర్ వేసిన 11వ ఓవర్లో ఓ సిక్సర్ కొట్టిన గుల్బాదిన్ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. అతడు రోహిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. రెండో స్పెల్కు వచ్చిన బిష్ణోయ్.. 15వ ఓవర్లో రెండో బంతికి మహ్మద్ నబీ (18 బంతుల్లో 14, 1 ఫోర్) ని ఔట్ చేయడంతో అఫ్గాన్ ఔదో వికెట్ కోల్పోయింది.
ఆఖర్లో అర్ష్దీప్ అదుర్స్..
నజీబుల్లా కూడా ఉన్నంతసేపు దాటిగానే ఆడాడు. బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు, ఓ బౌండరీ రాబట్టిన అతడు.. అర్ష్దీప్ వేసిన 18వ ఓవర్లో తొలి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన ముజీబ్ ఉర్ రెహ్మాన్.. సిక్సర్, ఫోర్ కొట్టాడు. దూబే వేసిన 19వ ఓవర్లో కరీమ్ జనత్.. 4, 6 బాదగా ఆఖరి బంతికి ముజీబ్ సిక్స్ కొట్టాడు. అర్ష్దీప్ వేసిన ఆఖరి ఓవర్లో జనత్, నూర్ అహ్మద్ను ఔట్ చేయగా ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫరూఖీలు రనౌట్ అయ్యారు. ఆఖరి ఓవర్లో ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది.