ఢాకా: బంగ్లాదేశ్తో తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. అద్భుత ఆటతీరుతో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టును 188 పరుగుల భారీ తేడాతో ఓడించింది. దాంతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 404 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయినా బంగ్లాదేశ్ను ఫాలోఆన్ ఆడించకుండా భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడింది. రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి ఇన్సింగ్స్ను డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కానీ, బంగ్లాదేశ్ రెండో ఇన్సింగ్స్లో 324 పరుగులకు ఆలౌట్ అయ్యి 188 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
భారత బ్యాటర్ చటేశ్వర్ పుజారాకు మోస్ట్ వాల్యూయెబుల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. పుజారా తొలి ఇన్నింగ్స్లో 90 పరుగులు, రెండో ఇన్సింగ్స్లో 102 పరుగులు చేశాడు. ఇక కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. రెండు ఇన్సింగ్స్లో కలిపి యాదవ్ 8 వికెట్లు పడగొట్టాడు.
ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. వేలి గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడంతో కేఎల్ రాహుల్ టీమిండియా సారథ్య బాధ్యతలు నిర్వహించారు. కాగా, టెస్టు సిరీస్కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో గెలుచుకుంది.