Team India Fans : భారత్(India), ఆస్ట్రేలియా(Australia) రెండో వన్డే చూసేందుకు ఇసుక వేస్తే రాలనంత మంది అభిమానులు తరలివచ్చారు. దాంతో, ఇండోర్లోని హోల్కరే స్టేడియం(Holkare Stadium) నిండిపోయింది. ఈ గ్రౌండ్లో భారీ స్కోర్లు ఖాయమని చరిత్ర చెబుతుండటంతో భారత బ్యాటర్ల విన్యాసాలు వీక్షించేందుకు ఫ్యాన్స్ పెద్దఎత్తున మైదానానికి పోటెత్తారు. దీంతో స్టాండ్స్ పూర్తిగా నిండిపోయాయి.
అందుకని సమీపంలోని భవనాలపైకి ఎక్కి మరీ ఫ్యాన్ టీమిండియా బ్యాటింగ్ చూస్తూ కనిపించారు. ఆ ఫొటోలు వైరల్గా మారాయి. ఆ ఫొటోలు చూసి.. ‘ఇది కదా ఫ్యాన్ పవర్ అంటే’ అని ఒకరు, ‘మన అభిమానులతో మామూలుగా ఉండదు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
ఈ మ్యాచ్లో భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వన్డేల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) సెంచరీలతో కదంతొక్కగా.. స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దాంతో, ఆసీస్కు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది.
శుభ్మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్ (105)
ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్(Asia Cup 2023)లో టీమ్ఇండియా మ్యాచ్లకు సైతం అభిమానులు రాలేదు. మైదానాలు వెలవెలబోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఒకవైపు వర్షాలు.. మరోవైపు ఖాళీ స్టాండ్స్తో ప్లేయర్లు సైతం ఆశ్చర్యపోయారు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ సూపర్-4 మ్యాచ్పై సైతం అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే.. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతోనే ప్రేక్షకులు స్టేడియానికి రాలేదని శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది.