బాలి: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శుక్రవారం ప్రపంచ చాంపియన్ సింధు 21-13, 21-10తో నెష్లిహన్ (టర్కీ)పై విజయం సాధించగా.. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో శ్రీకాంత్ 21-7, 21-18తో భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ను ఓడించి ముందడుగు వేశాడు. 35 నిమిషాల్లో ముగిసిన మహిళల క్వార్టర్స్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు గట్టి పోటీ ఎదుర్కోని సింధు.. శనివారం సెమీస్లో టాప్సీడ్ అకానె యామగుచి (జపాన్)తో తలపడనుంది.