టోక్యో: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత యువ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో ప్రణయ్ 21-17, 21-16తో రెండో సీడ్ కెంటో మొమోటాపై అద్భుత విజయం సాధించాడు. గంటా పాటు సాగిన పోరులో ఆది నుంచే తనదైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన మొమోటాపై ప్రణయ్ తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు.
ఇరువురి మధ్య ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు జరుగగా మొమోటా ఏడుసార్లు విజయం సాధించాడు. మెగాటోర్నీలో అన్సీడెడ్గా బరిలోకి దిగిన ప్రణయ్ ఎలాంటి అంచనాలు లేకుండానే జపాన్ స్టార్ షట్లర్ టైటిల్ ఆశలపై నీళ్లు గుమ్మరించాడు. గత మ్యాచ్ల్లో మొమోటాపై ఒకే ఒక గేమ్ గెలిచిన ప్రణయ్..ఈసారి వరుస గేముల్లో ఓడించి ఔరా అనిపించాడు.
మరోవైపు కామన్వెల్త్ సింగిల్స్ విజేత లక్ష్యసేన్ 21-17, 21-10తో లూయిస్ పెనాల్వర్(స్పెయిన్)పై విజయం సాధించాడు. 36 నిమిషాల్లోనే ముగిసిన పోరులో లక్ష్యసేన్ అద్భుత ఆటతీరు కనబరిచాడు. మిగతా మ్యాచ్ల విషయానికొస్తే మాజీ ప్రపంచ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ 9-21, 17-21తో జావో జున్పెంగ్(చైనా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్, చిరాగ్శెట్టి ద్వయం 21-8, 21-10తో సొలీస్ జొనాథన్, అనిబల్ మార్విన్పై గెలిచి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించింది.