నైరోబి: కెన్యా వేదికగా జరుగుతున్న అండర్-20 ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్ప్రింటర్ అగసర నందినికి నిరాశ ఎదురైంది. శుక్రవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో బరిలోకి దిగిన నందిని సెమీఫైనల్లో 14.16 సెకన్ల టైమింగ్తో ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు జరిగిన హీట్స్లో 14.18 సెకన్లతో నాలుగో స్థానంతో ఆకట్టుకున్న ఈ యువ స్ప్రింటర్ సెమీస్లో రాణించలేకపోయింది. మరోవైపు మహిళల లాంగ్జంప్లో శైలి సింగ్ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూపు-బిలో పోటీకి దిగిన శైలి 6.40 మీటర్లు దూకి టాప్లో నిలిచింది. గత నెల యూరోపియన్ అండర్-20 విజేత మజా అస్కగ్ (స్వీడన్) గ్రూప్-బి జాబితాలో శైలి తర్వాత స్థానంలో ఉంది. ఆదివారం జరిగే తుదిపోరులో రాణిస్తే భారత్కు మరో పతకం ఖాయమైనట్లే. మరోవైపు పురుషుల 200 మీటర్ల హీట్స్లో తెలుగు స్ప్రింటర్ షణ్ముగ శ్రీనివాస్ (21.33సె) టైమింగ్తో సెమీస్కు అర్హత సాధించలేకపోయాడు.