ముంబై: గత మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత్.. రెండో మ్యాచ్ లో అదే జోరు కొనసాగించలేకపోయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి పోరులో విజయం సాధించిన టీమ్ఇండియా.. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.
ఆల్రౌండర్ దీప్తి శర్మ (30) టాప్ స్కోరర్ కాగా.. రిచ ఘోష్ (23), స్మృతి మంధన (23) రాణించారు. ఆసీస్ బౌలర్లలో జార్జియా, అనాబెల్, కిమ్ గార్త్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. ఎలీసా పెర్రీ (34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడింది. మన బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో పోరు మంగళవారం జరగనుంది.