పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో భారత అమ్మాయిల జట్టు
పరాజయం పాలైంది. బ్యాటర్లు మెరుగైన ప్రదర్శనే కనబర్చినా.. బౌలర్ల వైఫల్యానికి టీమ్ఇండియా మూల్యం చెల్లించుకుంది.
ముంబై: ఆస్ట్రేలియా చేతిలో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత మహిళల క్రికెట్ జట్టు.. ఆఖరి టీ20 లోనూ పరాజయం పాలైంది. మంగళవారం బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఆఖరి మ్యాచ్లో టీమ్ఇండియా 54 పరుగుల తేడాతో ఓడింది. దీంతో ఆసీస్ 4-1తో సిరీస్ చేజిక్కించుకుంది. చివరి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆష్లే గార్డ్నర్ (32 బంతుల్లో 66 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్), గ్రేస్ హ్యారిస్ (35 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ధశతకాలతో రాణించారు. 10 ఓవర్లలో 72/4తో నిలిచిన ఆసీస్.. గార్డ్నర్, హ్యారిస్ జోరుతో చివరి పది ఓవర్లలో 124 పరుగులు రాబట్టింది. వీరిద్దరిని అడ్డుకోవడంలో మన బౌలర్లు విఫలమవడంతో టీమ్ఇండియా ముందు కొండంత లక్ష్యం నిలిచింది. మన బౌలర్లలో అంజలి శ్రావణి, దీప్తి శర్మ, షఫాలీ వర్మ, దేవిక తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది.
స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ (34 బంతుల్లో 53; 8 ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటం చేసింది. ఓపెనర్ స్మృతి మందన (4) తొలి ఓవర్లోనే ఔట్ కాగా.. షఫాలీ వర్మ (13), హర్లీన్ డియోల్ (24), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (12), రిచ ఘోష్ (10) ఎక్కువసేపు నిలువలేకపోయారు. సహచరులు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా పోరాటం ఆపని దీప్తి ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటైంది. ఆసీస్ బౌలర్లలో హీథర్ గ్రహమ్ 4 వికెట్లు పడగొట్టింది. అందుటో హ్యాట్రిక్ ఉండటం విశేషం. 13వ ఓవర్ చివరి రెండు బంతులకు దేవిక (11), రాధా యాదవ్ (0)ను ఔట్ చేసిన హీథర్.. చివరి ఓవర్ తొలి బంతికి రేణుక (2)ను బుట్టలో వేసుకొని హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. ఆష్లే గార్డ్నర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు లభించాయి.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 196/4 (గార్డ్నర్ 66 నాటౌట్, హ్యారిస్ 64 నాటౌట్; షఫాలీ 1/17, దేవిక 1/26),
భారత్: 142 ఆలౌట్ (దీప్తి 53, హర్లీన్ 24; హీథర్ 4/8, గార్డ్నర్ 2/20).