ఢిల్లీ: ఇటీవలే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్ను స్వదేశంలో నిర్వహించేందుకు ఆలిండియా చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మధ్య వరల్డ్ చాంపియన్షిప్ జరగాల్సి ఉండగా.. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం తరఫున బిడ్ దాఖలైనట్టు ఫిడే సీఈవో ఎమిల్ సుటొవ్స్కి బుధవారం తెలిపారు.
ప్రస్తుతానికి భారత్ మాత్రమే బిడ్ వేయగా సింగపూర్ సైతం పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బిడ్ భారత్కే దక్కితే గుకేశ్.. చెన్నైలోనే డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో తలపడాల్సి ఉంటుంది. ఈ టోర్నీ ఖర్చు రూ. 71 కోట్లు ఉండొచ్చని అంచనా. విజేతకు 2.5 మిలియన్ల అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 20 కోట్లు) ప్రైజ్ మనీ అందనుంది.