దుబాయ్: భారత మహిళల ఫుట్బాల్ జట్టు స్నేహపూర్వక మ్యాచ్ల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అడుగుపెట్టింది. ఏఎఫ్సీ మహిళల ఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు యూఏఈ, బహ్రెయిన్లో ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడనుంది. జార్ఖండ్లోని జాతీయ శిబిరం నుంచి నేరుగా యూఏఈ బయలుదేరిన భారత జట్టులో తెలంగాణ యంగ్ ఫార్వర్డ్ ప్లేయర్ గుగులోతు సౌమ్య కూడా ఉంది. 23 మందితో కూడిన భారత జట్టు శనివారం యూఏఈతో సోమవారం ట్యునీషియాతో మ్యాచ్లు ఆడనుంది. ‘ఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా మ్యాచ్ ప్రాక్టీస్ లభించడంతో జట్టు ఉత్సాహంగా ఉంది. మైదానంలో దిగేందుకు అమ్మాయిలు తహతహలాడుతున్నారు. గత నెల రోజులుగా జట్టు తీవ్రంగా శ్రమించింది. మా ప్రణాళికలను అమలు పరిచేందుకు ప్రయత్నిస్తాం’ అని భారత హెడ్ కోచ్ థామస్ డెన్నెర్బె పేర్కొన్నాడు.