Davis Cup: సుమారు 60 ఏండ్ల తర్వాత పాకిస్తాన్లో పర్యటిస్తున్న భారత డేవిస్ కప్ (టెన్నిస్)కు ఆ ప్రభుత్వం భారీ భద్రత కల్పిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వాధినేతకు ఇచ్చే ఐదంచెల భద్రతను భారత జట్టుకు అందిస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సి ఉన్న డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ – ప్లే ఆఫ్ టై లో భాగంగా భారత్.. పాకిస్తాన్కు వెళ్లింది. భద్రత కారణాల దృష్ట్యా భారత ఆటగాళ్లు, అధికారులు పాక్కు వెళ్లడానికి మొదట సందేహాలు వ్యక్తం చేసినా తర్వాత పాకిస్తాన్ టెన్నిస్ ఫెడరేషన్ (పీటీఎఫ్) ఇచ్చిన హామీతో భారత జట్టు దాయాది దేశంలో పర్యటిస్తోంది. భారత డేవిస్ కప్ టీమ్ చివరిసారిగా 1964లో పాకిస్తాన్లో ఆడింది. ఆ తర్వాత భారత జట్టు పాక్కు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో ఈ పోటీలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయిదుగురు ఆటగాళ్లు, ఇద్దరు ఫిజియోలు, ఐటా అధికారులు ఆదివారం పాకిస్తాన్కు చేరుకున్నారు.
భారత డేవిస్ కప్ జట్టుకు భద్రత విషయంలో పీటీఎఫ్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ప్రయాణ సమయంలో భారత బృందానికి ఎస్కార్ట్ వాహనాలు, హోటల్స్లో వారికి వీవీఐపీ ఆతిథ్యం దక్కనుంది. మ్యాచ్లు జరగాల్సి ఉన్న ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బాంబ్ స్క్వాడ్స్తో తనిఖీలు చేయనున్నారు. అంతేగాక ఇస్లామాబాద్లో పదివేల సీసీ కెమెరాలతో నగరం నిఘా నీడలో ఉందని పీటీఎఫ్ తెలిపింది.
ఇదే విషయమై పీటీఎఫ్ కార్యదర్శి కల్నల్ గుల్ రెహ్మాన్ మాట్లాడుతూ… ‘60 ఏండ్ల తర్వాత భారత డేవిస్ కప్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తోంది. భారత జట్టుకు మేం ఐదంచెల భద్రత కల్పిస్తున్నాం. ఆసియాలోనే ఇస్లామాబాద్ అత్యంత సేపెస్ట్ సిటీ. ఇప్పటికే ఇక్కడ సాధారణ ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉంది. భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు…‘ అని అన్నాడు.
సుదీర్ఘ కాలం తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్తాన్కు రావడం పట్ల ఆ దేశ టెన్నిస్ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా చరిత్రాత్మకమని అభివర్ణిస్తున్నారు. ‘ఎట్టకేలకు భారత డేవిస్ కప్ టీమ్ పాకిస్తాన్కు వచ్చింది. ఈ టూర్ సక్సెస్ అయితే ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు కూడా పాకిస్తాన్లో పర్యటిస్తే చాలా సంతోషిస్తా. ప్రస్తుతం డేవిస్ కప్ వచ్చిన భారత ఆటగాళ్లు ఇస్లామాబాద్లో రెస్టారెంట్స్కు, ఇతర ప్రాంతాలకు వెళ్లాలి. ఈ నగరాన్ని పర్యటించాలి..’అని ఈ టోర్నీలో పాకిస్తాన్ తరఫున ఆడుతున్న అకీల్ ఖాన్, ఐసమ్ ఉల్ హక్లు అన్నారు.