మాంటెకార్లో: గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న భారత టెన్నిస్ సంచలనం సుమిత్ నాగల్ మరో అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఫ్రాన్స్లోని మాంటె కార్లో వేదికగా జరుగుతున్న ఏటీపీ మాంటెకార్లో మాస్టర్స్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాగల్ 5-7, 6-2, 6-4 తేడాతో ఇటలీకి చెందిన 38వ ర్యాంకర్ మాటియో ఆర్నాల్డీని చిత్తు చేశాడు. తన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న ప్రత్యర్థితో ఆడిన నాగల్.. మాటియోతో తొలి సెట్లో హోరాహోరి పోరాడినా ప్రత్యర్థిదే పైచేయి అయింది. కానీ రెండో సెట్లో బలంగా పుంజుకున్న 95వ ర్యాంకర్ అయిన నాగల్.. అదే జోరును మూడో సెట్లోనూ కొనసాగించి ఈ టోర్నీలో రెండో రౌండ్ ఆడనున్న తొలి భారత ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. ప్రిక్వార్టర్స్లో అతడు ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్జర్ రున్ (డెన్మార్క్)తో తలపడతాడు.
మాంటె కార్లో క్వాలిఫయింగ్ రౌండ్లో 55వ ర్యాంక్లో ఉన్న ఫాకుండో (అర్జెంటీనా) ను ఓడించి 42 ఏండ్ల తర్వాత ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్న తొలి భారతీయుడిగా నిలిచిన నాగల్.. తాజాగా టాప్-50 లోపు ఉన్న మరో ప్లేయర్కు షాకివ్వడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభ సీజన్ ఆస్ట్రేలియా ఓపెన్లో ప్రపంచ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బల్బిక్ను ఓడించిన నాగల్.. తాజాగా మరో అగ్రశ్రేణి ఆటగాడిని మట్టికరిపించడం విశేషం. ఈ విజయం ద్వారా నాగల్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంకింగ్ (80)కు ఎగబాకనున్నాడు.