టోక్యో: విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు బయలుదేరిన భారత బృందం ఆదివారం టోక్యో ఒలింపిక్స్ క్రీడా గ్రామానికి చేరుకుంది. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న క్రీడలు కావడంతో 88 మంది భారత అథ్లెట్ల బృందం ప్రొటోకాల్స్ను పాటిస్తూ మాస్క్లు, ఫేస్ షీల్డ్లతో గేమ్స్ విలేజ్లో అడుగుపెట్టింది. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో టోక్యో చేరుకున్న మనవాళ్లు.. సుమారు ఆరు గంటల పాటు విమానాశ్రయంలో ఎదురు చూసి.. కరోనా పరీక్షల ఫలితాలు వచ్చాక క్రీడా గ్రామానికి చేరుకున్నారు. ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ మేరీ కోమ్, ప్రపంచ నంబర్వన్ బాక్సర్ అమిత్ పంగల్, స్టార్ ఆర్చర్ దీపిక కుమారి, టీటీ ప్లేయర్ మనికాబాత్రా, పురుషుల, మహిళల హాకీ జట్లతో పాటు ఇతర ఆటగాళ్లు ఈ బృందంలో ఉన్నారు. కాగా.. తాజా పరీక్షల్లో మనవాళ్లందరికీ కరోనా నెగెటివ్గా నిర్ధారణ అయినట్లు సాయ్ అధికారి తెలిపారు.
మరో రెండు కేసులు
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టోక్యో ఒలింపిక్స్లో మరో రెండు కరోనా కేసులు వెలుగు చూశాయి. ఇప్పటికే శనివారం గేమ్స్ విలేజ్లో ఓ అథ్లెట్కు వైరస్ సోకిందని నిర్వహకులు ప్రకటించగా.. తాజాగా ఆఫ్రికా దేశాలకు చెందిన ఫుట్బాల్ జట్టు ఆటగాళ్లలో ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ అని తేలింది.