PV Sindhu | నిరుడు బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం నెగ్గిన అనంతరం స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. కెనడా ఓపెన్లో దుమ్మురేపుతున్నది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీలో ఈ హైదరాబాదీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. రెండు ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత తొలి మహిళా ప్లేయర్గా రికార్డుల్లోకెక్కిన సింధు.. పారిస్ (2024) ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. విశ్వ క్రీడా సమరానికి ఎంపికవ్వాలంటే.. ర్యాంకింగ్ టోర్నీలో పాల్గనడం తప్పనిసరి కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సింధు.. తాజా కెనడా ఓపెన్లో విశ్వరూపం కనబరుస్తున్నది. శనివారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21-13, 21-7తో ఫాంగ్ జైపై విజయం సాధించింది. ఫాంగ్తో సింధుకు ఇది నాలుగో మ్యాచ్ కాగా.. గత మూడింట్లో పరాజయం పాలైన తెలుగమ్మాయి.. తొలిసారి ఆమెను చిత్తుచేసింది.
గాయం నుంచి కొలుకున్న తర్వాత పూర్తి స్థాయిలో సత్తాచాటలేకపోతున్న సింధు.. క్వార్టర్ ఫైనల్లో విజృంభించింది. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురవడంతో ఒక్కో పాయింట్ సాధిస్తూ ముందుకెళ్లిన సింధు.. 14-10తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోని ఈ తెలుగమ్మాయి అదే జోరు కొనసాగిస్తూ తొలి గేమ్ సొంతం చేసుకుంది. రెండో గేమ్లో ఫాంగ్కు ఏ మాత్రం అవకాశం ఇవ్వని సింధు వరుస పాయింట్లు ఖాతాలో వేసుకొని మ్యాచ్ను సొంతం చేసుకుంది. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్ అకానె యామగుచి (జపాన్)తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. ముఖాముఖీలో 14-10తో యామగుచిపై సింధుదే పైచేయి అయినా.. వీరిద్దరి మధ్య జరిగిన చివరి మ్యాచ్లో జపాన్ ప్లేయర్ చేతిలో సింధు పరాజయం పాలైంది. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ 21-8, 17-21, 21-10తో జూలియన్పై గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు.