అంతాల్య : ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్1 పోటీలలో కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో భారత జోడీ జ్యోతి సురేఖ-ఓజాస్ దేవతలె స్వర్ణ పోరుకు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత జోడి మలేసియాకు చెందిన ఫతిన్ నఫ్రతే, మహ్మద్ జువైది మజూకిలపై 157-154 స్కోరుతో గెలుపొంది ఫైనల్కు చేరుకుని భారత్కు రెండో పతకం ఖాయం చేశారు. అంతకుముందు అతాను దాస్, బి.ధీరజ్, తరుణ్దీప్ రాయ్లతో కూడిన పురుషుల రికర్వ్ జట్టు ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో సెమీఫైనల్కు చేరిన జ్యోతి సురేఖ మరో పతకం సాధించే అవకాశం ఉంది.