యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీకి తోడు.. మిగిలినవాళ్లు కూడా రాణించడంతో నాలుగో టెస్టులో టీమ్ఇండియా దీటుగా బదులిస్తున్నది. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయగా.. మూడో రోజంతా బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన మూడు వికెట్లు కోల్పోయి మూడొందలకు చేరువైంది. చాన్నాళ్ల తర్వాత భారత పిచ్పై ఓ టెస్టు మ్యాచ్ నాలుగో రోజుకు చేరగా.. లోయర్ ఆర్డర్తో కలిసి విరాట్ కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తాడో చూడాలి! మరో రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉన్న ఈ టెస్టులో ఫలితం తేలాలంటే టీమ్ఇండియా ఈ రోజు వేగంగా ఆడాల్సిందే!
అహ్మదాబాద్: నిర్జీవమైన పిచ్పై భారత బ్యాటర్లు సమిష్టిగా సత్తాచాటడంతో ఆఖరి టెస్టులో భారత్ మంచి స్కోరు దిశగా సాగుతున్నది. ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (235 బంతుల్లో 128; 12 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో కదంతొక్కగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (128 బంతుల్లో 59 బ్యాటింగ్; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (121 బంతుల్లో 42), కెప్టెన్ రోహిత్ శర్మ (35) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లియాన్, కునేమన్, మార్ఫి తలా ఒక వికెట్ పడగొట్టారు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న భారత్.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 191 పరుగులు వెనుకబడి ఉంది. కోహ్లీతో పాటు స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (16) క్రీజులో ఉన్నాడు. మూడో రోజు సెషన్కు ఒకటి చొప్పున రోహిత్ సేన మూడు వికెట్లు కోల్పోగా.. ఆసీస్ స్పిన్ త్రయం ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకుంది.
ఓవర్నైట్ స్కోరు 36/0తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా సాధికారికంగా ఆడింది. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ గిల్ పరుగుల వరద పారిస్తే.. ఉన్నంతసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రోహిత్ శర్మ కునేమన్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీతో 74 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడగా.. చతేశ్వర్ పుజారా రాకతో ఇన్నింగ్స్ తిరిగి గాడినపడింది. ఒక ఎండ్లో గిల్ కంగారూ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూంటే.. మరోవైపు ఆసీస్ ప్లేయర్లను పుజారా విసిగించాడు. ఈ క్రమంలో గిల్ 90 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్కు 113 పరుగులు జోడించిన అనంతరం పుజారా మార్ఫి బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికే గిల్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అతడికి విరాట్ కోహ్లీ జతవడంతో టీమ్ఇండియాకు తిరుగులేకుండా పోయింది.
ఈ ఇద్దరే ఆట ముగించేలా కనిపించినా.. చివరకు లియాన్ బౌలింగ్లో గిల్ ఔటయ్యాడు. పిచ్ నుంచి చక్కటి సహకారం లభిస్తున్న చోట సీనియర్ బ్యాటర్లు కూడా ఇబ్బంది పడుతున్నా.. గిల్ మాత్రం తన క్లాస్ కొనసాగించాడు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను తప్పించి జట్టులో స్థానం దక్కించుకున్న గిల్ గత మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. అహ్మదాబాద్లో సూపర్ ఇన్నింగ్స్తో అలరించాడు. చివర్లో బంతి కాస్త టర్న్ అవుతుండటంతో కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా రోజు ముగించారు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు 99 ఓవర్లు ఆడిన భారత్ 289 పరుగులు చేసింది. వేసవి తాపానికి ఆస్ట్రేలియా ఫీల్డర్లు తీవ్రంగా ఇబ్బంది పడగా.. నాలుగో రోజు మనవాళ్లు ఎంతసేపు బ్యాటింగ్ చేయగలరనేదానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు నేరుగా అర్హత సాధించాలంటే భారత్కు ఈ మ్యాచ్లో విజయం తప్పనిసరి.
4 ఒక క్యాలెండర్ ఇయర్లో అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేసిన నాలుగో భారత బ్యాటర్గా, ఓవరాల్గా పదో క్రికెటర్గా శుభ్మన్ గిల్ రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు భారత్ తరఫున సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఈ ఫీట్ అందుకున్నారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 480; భారత్ తొలి ఇన్నింగ్స్: 289/3 (గిల్ 128, కోహ్లీ 59 బ్యాటింగ్; కునేమన్ 1/43, మార్ఫి 1/45).