ప్రస్తుతం టీమిండియా ఆడే అన్ని కీలక సిరీసుల్లోనూ ప్రధాన పేసర్ స్థానం కోసం పోటీ పడుతున్న బౌలర్లలో హైదరబాదీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఒకడు. పలు సిరీసుల్లో కీలకమైన వికెట్లు తీసి అందరి చేత ప్రశంసలు అందుకున్న సిరాజ్.. వెస్టిండీస్తో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్లో కూడా మెరిశాడు.
అహ్మదాబాద్లో జరిగిన తొలి వన్డేలో అతను తీసింది ఇక వికెటే.. కానీ అది మూడో ఓవర్లోనే కావడం గమనించాల్సి అంశం. ఎందుకంటే 2019 ప్రపంచకప్ తర్వాత ఇప్పటి వరకు వన్డేల్లో టీమిండియా బౌలర్లు తొలి పవర్ ప్లేలో కేవలం 10 వికెట్లు మాత్రమే తీశారు. అదే సమయంలో వారి సగటు 120గా ఉంది. అలా తొలి పవర్ప్లేలో వికెట్ కోసం టీమిండియా చాలా కష్టాలు పడుతోంది.
ఇలాంటి సమయంలో విండీస్పై మూడో ఓవర్లోనే వికెట్ తీయడంతోపాటు బ్యాటర్లను తన బౌలింగ్తో తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు సిరాజ్. తొలి పవర్ప్లేలో వేసిన 5 ఓవర్లలో రెండు మెయిడెన్లు ఉన్నాయంటేనే సిరాజ్ బౌలింగ్ ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని భారత లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ఎత్తిచూపాడు. సిరాజ్ చాలా మనస్ఫూర్తిగా బౌలింగ్ చేస్తాడని, అలాగే బాగా ఆలోచిస్తాడని మెచ్చుకున్నాడు.
‘సిరాజ్ వేసే తొలి బంతి, అలాగే ఇన్నింగ్స్ చివరి బంతి రెండూ ఒకే ఎనర్జీతో వేస్తాడు. అలాంటి వారి కోసమే ప్రతి కెప్టెన్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటాడు’ అని సన్నీ చెప్పాడు. అలాగే భారత వెటరన్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీతో కలిసి ఎంతగా బౌలింగ్ చేస్తే అంతగా సిరాజ్ ఎదుగుతాడన్నాడు. వీళ్లిద్దరూ ఫీల్డింగ్ సమయంలో కూడా ప్రతి బాల్ వేసేటప్పుడు సిరాజ్తో మాట్లాడతారని, ఇలా చేయడం వల్ల సిరాజ్ బౌలింగ్ మరింత పదునెక్కుతుందని పేర్కొన్నాడు.