న్యూఢిల్లీ: ఫిఫా ప్రపంచకప్(2022), ఆసియా కప్(2023) అర్హత మ్యాచ్ల కోసం దోహాకు చేరుకున్న భారత ఫుట్బాల్ జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. గత బుధవారం దోహాకు చేరుకున్న సునీల్ ఛెత్రీ సారథ్యంలోని టీమ్ఇండియా సభ్యులకు జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో అందరికీ నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. ‘సన్నాహక శిబిరానికి ముందు మొత్తం 28 మంది ప్లేయర్లు, సహాయక సిబ్బందికి జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. జూన్ 3న ఖతార్తో జరిగే మ్యాచ్ కోసం బయోబబుల్లో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు’ అని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ శనివారం పేర్కొన్నారు. గత(శుక్రవారం) రాత్రి టీమ్ఇండియా ప్రాక్టీస్ చేసిన ఫొటోలను ఏఐఎఫ్ఎఫ్ తమ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. గ్రూపు-ఈలో ప్రస్తుతం మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్న భారత్..బంగ్లాదేశ్(జూన్ 7), ఆఫ్ఘనిస్థాన్(జూన్ 15)తో అర్హత మ్యాచ్లు ఆడనుంది. ఆసియా కప్ బెర్తు లక్ష్యంగా భారత్ పోటీపడే అవకాశముంది.