బ్యాంకాక్: భారత డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రజతంతో సరిపెట్టారు. ఈ సీజన్లో ఆడిన తొలి ఫైనల్లో టైటిల్ కోసం అద్భుతంగా పోరాడినా.. నాలుగు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని ఆశలు రేపినా చివరకు రన్నరప్తోనే తిరిగొచ్చారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ తుదిపోరులో ప్రపంచ 4వ ర్యాంకర్ సాత్విక్ – చిరాగ్ ద్వయం 12-21, 23-25 తేడాతో లియో రాలీ కర్నాండో- డేనియల్ మార్టిన్ (ఇండోనేషియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి గేమ్లో భారత జోడీ ఆరంభం నుంచే లయ తప్పి వరుస తప్పిదాలు చేసింది.
కానీ, రెండో గేమ్లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేసింది. ఇండోనేషియా షట్లర్ మార్టిన్ తన పదునైన స్మాష్లతో భారత డిఫెన్స్ను పరీక్షించగా.. సాత్విక్ – చిరాగ్ గట్టి పోటీ ఇస్తూ స్కోరును 5-5తో సమం చేశారు. ఆ తర్వాత చిరాగ్ కొట్టిన అద్భుతమైన నెట్ రిటర్న్తో 7-5తో ఆధిక్యం అందుకున్న భారత జోడీ 11-9తో విరామానికి వెళ్లింది. అయితే ఇండోనేసియా ద్వయం 14-14తో స్కోరు సమం చేసింది.
ఇరు జంటలూ 19-19తో నిలిచిన దశలో ఆట అత్యంత ఉత్కంఠగా సాగింది. ఇండోనేషియా జోడీ వరుసగా మ్యాచ్ పాయింట్లపై నిలిచినా సాత్విక్-చిరాగ్ అద్భుతమైన డిఫెన్స్తో నాలుగు సార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుంటూ స్కోరును 23-23తో సమం చేసింది. అయితే ఐదో మ్యాచ్ పాయింట్ వద్ద మార్టిన్ కొట్టిన పవర్ఫుల్ షాట్ను రిటర్న్ చేసే క్రమంలో షటిల్ను నెట్కు కొట్టిన భారత జోడీ మ్యాచ్ కోల్పోయింది.