న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటడం ద్వారా భారత బాక్సర్లు ఒలింపిక్ పతకాలపై ఆశలు రేపుతున్నారు. 9 మంది భారత బాక్సర్లు విశ్వక్రీడలకు అర్హత సాధించగా.. మేరీకోమ్, అమిత్ పంగల్పైనే అందరి దృష్టి నిలువనుంది. లండన్ (2012) ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గడం ద్వారా బాక్సింగ్లో పతకం సాధించిన తొలి భారత మహిళగా చరిత్రకెక్కిన స్టార్ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు).. తన చివరి విశ్వక్రీడల్లో పతకం సాధించి కెరీర్కు ఘనమైన వీడ్కోలు పలకాలనుకుంటుంటే.. లైట్ వెయిట్లో రికార్డులు తిరగరాసేందుకు పంగల్ (52 కేజీలు) రెడీ అవుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్లో త్రివర్ణ పతాకధారిగా భారత బృందాన్ని ముందుండి నడిపించనున్న మేరీ.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో ఫిలిప్పీన్స్ బాక్సర్ను చిత్తుచేసి విశ్వక్రీడలకు అర్హత సాధించింది.
ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ 38 ఏండ్ల మేరీకోమ్ ఈ సారి స్వర్ణంపై గురిపెట్టగా.. మహిళల విభాగంలో లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), సిమ్రన్జీత్ కౌర్ (60 కేజీలు), పూజారాణి (75 కేజీలు)లు కూడా పతకం పట్టాలనే కసిమీద ఉన్నారు. పురుషుల విభాగంలో బీజింగ్ఒలింపిక్స్లో విజేందర్ సింగ్ కాంస్యం నెగ్గడంతో మనదేశంలో బాక్సింగ్కు క్రేజ్ పెరిగింది. అతడిని స్ఫూర్తిగా తీసుకొని రింగ్లో అడుగుపెట్టిన యువ బాక్సర్ అమిత్ పంగల్.. ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గి ఒలింపిక్స్ పతకంపై అంచనాలు పెంచేశాడు. అన్నీ కలిసివస్తే వికాస్ క్రిషన్ (69 కేజీలు), మనీశ్ కౌషిక్ (63 కేజీలు), ఆశీష్ కుమార్ (75 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) కూడా చరిత్ర లిఖించేందుకు సిద్ధంగా ఉన్నారు.