న్యూఢిల్లీ: బర్మింగ్హామ్ వేదికగా ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో 215 మందితో కూడిన భారత అథ్లెటిక్స్ బృందం బరిలోకి దిగనుంది. ఇందులో 108 మంది పురుషులు, 107 మంది మహిళలు ఉన్నారని భారత ఒలింపిక్ సమాఖ్య (ఐవోఏ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో హాకీ జట్లదే సింహభాగం కాగా.. ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో మహిళా క్రికెటర్లు కూడా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రాపై భారీ అంచనాలుండగా.. ఈ బృందానికి రాజేశ్ భండారి చెఫ్ డి మిషెన్గా వ్యవహరించనున్నారు.
కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి భారీ పారితోషకాలు ఇవ్వాలని ఐవోఏ నిర్ణయించింది. పసిడి పతకం నెగ్గినవారికి రూ. 20 లక్షలు, రజతం గెలిచిన వారికి రూ.10 లక్షలు, కాంస్యం చేజిక్కించుకున్న వారికి రూ. 7.5 లక్షల నజరానా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.