ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన భారత్.. రెండు వారాలు తిరిగే సరికి అదే ఆసీస్పై టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. వరల్డ్కప్లో దుమ్మురేపిన రోహిత్, కోహ్లీ, రాహుల్, గిల్, జడేజా, షమీ, బుమ్రా, సిరాజ్ వీరిలో ఒక్కరు కూడా లేకుండానే.. కంగారూలపై మనవాళ్లు ట్రోఫీ నెగ్గారు.
ఆస్ట్రేలియా జట్టులోనూ సీనియర్లు విశ్రాంతి తీసుకున్నారనేది నిజమే అయినా.. వ్యవస్థాగతంగా బలంగా ఉండే కంగారూలపై 4-1తో సిరీస్ గెలువడం చిన్న విషయమేం కాదు. సీనియర్లు లేకపోవడంతో అందివచ్చిన అవకాశాలను యువ ఆటగాళ్లు చక్కగా వినియోగించుకొని భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నారు!
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : మన దేశంలో ప్రతిభకు కొదవలేదని కొత్త కుర్రాళ్లు నిరూపించుకుంటున్నారు. రవి బిష్ణోయ్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ ఇలా అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించి భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మ్యాక్స్వెల్, స్మిత్, సూర్యకుమార్ వంటి ఎందరో స్టార్ ప్లేయర్లు పాల్గొన్న సిరీస్లో రవి బిష్ణోయ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడంటే.. అతడిలో ఏదో ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది అని అంగీకరించక తప్పదు. బిష్ణోయ్ ఒక్కడే కాదు.. ఈ సిరీస్ ద్వారా రింకూ సింగ్ ఫినిషింగ్కు మరింత పేరు ప్రఖ్యాతులు రాగా.. ముఖేశ్ కుమార్ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్గా అవతరించాడు. దేశవాళీ, ఐపీఎల్ అనుభవంతో అంతర్జాతీయ క్రికెట్లో సత్తాచాటుతున్న యువ ఆటగాళ్లు మరికాస్త కష్టపడితే జట్టులో చోటు సుస్థిరం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు!
వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఓడిన నాలుగో రోజే భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 జరిగింది. అర్ష్దీప్, ప్రసిద్ధ్, రవి, ముఖేశ్తో కూడిన భారత బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆసీస్ తొలుత భారీ స్కోరు చేసింది. ఛేదన కష్టమే అనుకున్న తరుణంలో సూర్యకుమార్, ఇషాన్ కిషన్ రాణించి జట్టును గెలిపించారు. వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సూర్య.. తనకు అచ్చొచ్చిన ఫార్మాట్లో అటు బ్యాటర్గానూ.. ఇటు సారథిగానూ చక్కటి ప్రభావం చూపాడు. ఇక రెండో మ్యాచ్ విషయానికి వస్తే తొలుత టీమ్ఇండియాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాగా.. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ అర్ధశతకాలతో జట్టుకు కొండంత స్కోరు సాధించిపెట్టారు. బౌలింగ్లోనూ సత్తాచాటడంతో భారత్ సిరీస్లో ఆధిక్యంలో దూసుకెళ్లింది.
మూడో పోరులోనైతే పరుగుల వరద పారింది. మొదట రుతురాజ్ గైక్వాడ్ భారీ సెంచరీతో భారత్ 222 పరుగులు చేయగా.. ఛేదనలో మ్యాక్స్వెల్ సునామీ సృష్టించడంతో ఆసీస్ సిరీస్లో కోలుకోగలిగింది. ఈ మూడు మ్యాచ్లనే తీసుకుంటే.. ఆ జట్టులో ఆస్ట్రేలియా అనుభవజ్ఞులతోనే బరిలోకి దిగింది. స్మిత్, షార్ట్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, ట్రావిస్ హెడ్, మాథ్యూ వేడ్, ఆడమ్ జంపా, సీన్ అబాట్ ఇలా ప్రధాన ఆటగాళ్లు అందరూ అందుబాటులో ఉన్న సమయంలోనూ కంగారూలపై మనవాళ్లు పైచేయి కనబర్చారు. ఇక చివరి రెండు మ్యాచ్లకు ఆసీస్ ప్రధాన ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి వెళ్లిన సమయంలోనైతే.. మన కుర్రాళ్లు సంపూర్ణ ఆధిపత్యం చూపారు.
దేశవాళీలతో పాటు ఐపీఎల్ లాంటి అత్యంత పోటీ ఉండే టోర్నీ ద్వారా రోజు రోజుకు మరింత రాటుదేలుతున్న కొత్తతరం.. అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తాచాటగలం అని నిరూపిస్తున్నది. అయితే వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనుండగా.. అందులో ఎంత మంది యువ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందో చూడాలి. నిరుడు ఆస్ట్రేలియా వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్కు దూరం కాగా.. 2024 మెగాటోర్నీలోనూ ఈ ఇద్దరినీ ఆడించాలని బోర్డు యోచిస్తున్నది. ఇదే జరిగితే ద్వైపాక్షిక సిరీస్ల్లో సత్తాచాటి వెలుగులోకి వచ్చిన యువ ఆటగాళ్లకు నిరీక్షణ తప్పకపోవచ్చు. అయితే సమీప భవిష్యత్తులో భారత జట్టుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఈ ప్రతిభావంతులు చాటిచెబుతున్నారు.