ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ప్రియమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను టీమ్ఇండియా స్పిన్ తంత్రంతో కట్టడి చేస్తున్నది. సుడులు తిరిగే స్పిన్తో ఆసీస్ బ్యాటర్లను కంగుతినిపిస్తూ ఢిల్లీ కోటలో ఘన విజయంతో భారత్ గెలుపు బావుటా ఎగురవేసింది. స్పిన్ ట్విన్స్ రవీంద్రజడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్తో ఉక్కిరిబిక్కిరి అయిన కంగారూలు మూడు రోజుల్లోనే మ్యాచ్ను మనకు అప్పగించేశారు. స్పిన్ను ఎలా ఎదుర్కోవాలో తెలియక సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ప్రత్యర్థి బ్యాటర్లు అపసోపాలు పడ్డ చోట టీమ్ఇండియా స్పిన్ను దీటుగా ఎదుర్కొంటూ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను తిరిగి నిలబెట్టుకుంది.
న్యూఢిల్లీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఖాతాలో మరో విజయం. తమకు అచ్చొచ్చిన స్పిన్ను నమ్ముకున్న టీమ్ఇండియా..ఆస్ట్రేలియాను కంగుతినిపించింది. నాగ్పూర్ ఫలితాన్ని పునరావృతం చేస్తూ రోహిత్సేన ఢిల్లీలో గెలుపు ఢంకా బజాయించింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్లో టీమ్ఇండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆసీస్ నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 26.4 ఓవర్లలో 118/4 స్కోరు చేసింది. అంతకుముందు జడేజా(7/42) ధాటికి ఆసీస్ 31.1 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. రెండు ఇన్నింగ్స్లో పది వికెట్లు తీసిన జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. దీనికి తోడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ చాంపియన్షిప్లో ఫైనల్ బెర్తు దక్కించుకునేందుకు మరింత చేరువైంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1 న ఇండోర్లో మొదలవుతుంది.
జడ్డూ స్పిన్ జాదూ:
జడేజా విసిరిన స్పిన్ వలలో ఆస్ట్రేలియా విలవిలలాడిపోయింది. ఒకానొక దశలో మ్యాచ్పై పట్టు బిగించేలా కనిపించిన కంగారూలు జడ్డూ ధాటికి ఒక్కసారిగా చేష్టలుడిగిపోయారు. ఓవర్నైట్ స్కోరు 61/1తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 52 పరుగుల తేడాతో మిగిలిన తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్(43), లబుషేన్(35) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. ట్రావిస్ హెడ్ వికెట్తో మొదలైన ఆసీస్ వికెట్ల పతనం ఆఖరి వరకు కొనసాగింది. ఓవైపు అశ్విన్..మరో ఎండ్లో జడేజా స్పిన్తో ఇరువైపుల నుంచి దాడి చేయగా ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్ వెళ్లేందుకు పోటీపడ్డారు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు జడేజా బౌలింగ్లో స్వీప్ షాట్లకు ప్రయత్నించడం వికెట్లు సమర్పించుకోవడం. మ్యాచ్ హైలెట్స్ ఏమన్నా వస్తున్నాయా అన్న రీతిలో కంగారూలు బ్యాటింగ్లో ఘోరంగా వైఫల్యం చెందారు. పిచ్ పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న జడేజా తన స్పిన్ వైవిధ్యంతో ఏడు వికెట్లను ఖాతాలో వేసుకుని ఆసీస్ పనిపట్టాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు.
పుజారా, భరత్ కలిసి:
ఆసీస్ నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫార్మాట్తో సంబంధం లేకుండా ఫామ్లేమితో సతమతమవుతున్న కేఎల్ రాహుల్(1) మరోమారు తీవ్రంగా నిరాశపరిచాడు. ఆరు పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన భారత్ను కెప్టెన్ రోహిత్శర్మ(31), పుజారా(31 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్కు 32 పరుగులు జోడించారు. అయితే 30 పరుగుల తేడాతో రోహిత్తో పాటు కోహ్లీ(20) ఔట్ కావడంతో ఒకింత ఆందోళన కల్గించింది. శ్రేయాస్ అయ్యర్(12) కూడా నిరాశపర్చడంతో మ్యాచ్ మలుపు తిరుగుతుందా అని అందరూ ఉత్కంఠగా చూశారు. కానీ వందో టెస్టు ఆడుతున్న పూజారా, తెలుగు క్రికెటర్ కోన భరత్(23 నాటౌట్) జట్టును గెలుపుతీరాలకు చేర్చారు. వీరిద్దరు సమయోచితంగా ఆసీస్ బౌలింగ్ దాడిని ఎదుర్కొంటూ ఐదో వికెట్కు అజేయంగా 30 పరుగులు జోడించారు. ఈ క్రమంలో భరత్ మూడు ఫోర్లు, సిక్సర్తో ఆకట్టుకున్నాడు.
కోహ్లీ @ 25000
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఫార్మాట్తో సంబంధం లేకుండా లెక్కకుమిక్కిలి రికార్డులు తన పేరిట రాసుకున్న కింగ్ కోహ్లీ తాజాగా మరో మైలురాయిని చేరుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 25000 మార్క్ను తక్కువ ఇన్నింగ్స్(549)ల్లో చేరుకున్న ఆరో బ్యాటర్గా విరాట్ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టార్ బ్యాటర్కు ఇది సాధ్యమైంది. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఇన్నాళ్లు ఉన్న రికార్డు(577 ఇన్నింగ్స్)ను కోహ్లీ అధిగమించాడు. సోషల్మీడియా వేదికగా బీసీసీఐ కార్యదర్శి జైషా..కోహ్లీ రికార్డును అభినందిస్తూ ట్వీట్ చేశాడు.
‘భారత్కు చిరస్మరణీయ సిరీస్ విజయమిది. యువ క్రికెటర్ కేఎస్ భరత్ ఇన్నింగ్స్ అద్భుతం. కెరీర్లో మరో మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీకి అభినందనలు. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత స్పిన్నర్లకు శుభాకాంక్షలు.
-కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి