పల్లెకెలె: ఇప్పటికే టీ20 సిరీస్ చేజిక్కించుకుని లంక పర్యటనలో అదరగొడుతున్న భారత మహిళల జట్టు.. వన్డే సిరీస్ను 2-0తో హస్తగతం చేసుకుంది. సోమవారం రెండో వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట లంక 50 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. కాంచన (47 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో రేణుక సింగ్ 4.. మేఘన సింగ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు స్మృతి మందన (83 బంతుల్లో 94 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్), షఫాలీ వర్మ (71 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టడంతో భారత్ 25.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు చేసింది. రేణుకకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.