జింబాబ్వే పర్యటనలో టీమ్ఇండియా ఆధిపత్యం కొనసాగుతున్నది. బౌలర్లు మరోసారి విజృంభించడంతో గత మ్యాచ్ కంటే తక్కువ స్కోరుకే ప్రత్యర్థి కుప్పుకూలగా.. స్వల్ప లక్ష్యాన్ని మనవాళ్లు దాదాపు సగం ఓవర్లు మిగిలుండగానే పూర్తి చేశారు. కాకపోతే తొలి వన్డేలో వికెట్ కోల్పోకుండా టార్గెట్ చేజ్ చేసిన రాహుల్ సేన.. ఈసారి ఐదు వికెట్లు కోల్పోవడం ఒక్కటే చెప్పుకోదగ్గ మార్పు. మిగితాదంతా సేమ్ టు సేమ్.. యాక్షన్ రీప్లేలా సాగింది. కొత్తబంతితో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగితే.. మరో ఎండ్లో శార్దూల్ ఠాకూర్ వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్లో ధవన్ ధనాధన్ షాట్లతో మెరుపు ఆరంభాన్నిస్తే.. సంజూ శాంసన్ అంతకు మించిన ఫినిషింగ్ టచ్తో టీమ్కు సిరీస్ విజయం కట్టబెట్టాడు.
హరారే: బౌలర్ల జోరుకు.. బ్యాటర్ల సహకారం తోడవడంతో టీమ్ఇండియా మరో సిరీస్ ఖాతాలో వేసుకుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి.. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ పట్టేసింది. గత మ్యాచ్తో పోలిస్తే బౌలర్లు మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చగా.. టాపార్డర్ కాస్త నిరాశ పరిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే.. 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (42; 3 ఫోర్లు, ఒక సిక్సర్), ర్యాన్ (39 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) కాస్త పోరాడారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 25.4 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (39 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. శిఖర్ ధవన్ (21 బంతుల్లో 33; 4 ఫోర్లు), శుభ్మన్ గిల్ (33; 6 ఫోర్లు) రాణించారు. గత మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కని కెప్టెన్ కేఎల్ రాహుల్ (1) ఆకట్టుకోలేకపోయాడు. వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ మూడు క్యాచ్లు అందుకోవడంతో పాటు చక్కటి ఇన్నింగ్స్తో జట్టును గెలిపించిన శాంసన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య సోమవారం ఇక్కడే నామమాత్రమైన మూడో వన్డే జరుగనుంది.
గత మ్యాచ్లో ప్రత్యర్థిని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన దీపక్ చాహర్ ఈ మ్యాచ్ బరిలో దిగకపోగా.. ఇన్నింగ్స్ తొలి బంతికే హైదరాబాదీ పేసర్ సిరాజ్ స్వింగ్ రాబట్టి అదుర్స్ అనిపించాడు. భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న సిరాజ్.. అదే తరహా కచ్చితత్వంతో బంతులు విసురుతూ ఆకట్టుకున్నాడు. ప్రతి బంతికి వికెట్ తీసేలా కనిపించిన అతడు.. ఎట్టకేలకు తొమ్మిదో ఓవర్లో జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. కాసేపటికి శార్దూల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో డబుల్ ధమాకా మోగించగా.. ప్రసిద్ధ్ ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దీపక్ చాహర్ ఎందుకు ఆడలేదనే అంశంపై జట్టు యాజమాన్యం స్పష్టతనివ్వకపోగా.. గత మ్యాచ్తో పోల్చుకుంటే జింబాబ్వే ఆటగాళ్లు మరీ నాసిరకంగా ఆడారు. క్రీజులో కుదురుకుంటే పరుగులు వాటంతటవే వస్తాయని గుర్తించని టాపార్డర్ ఒకరి వెంట ఒకరు పెవిలియన్ చేరిపోగా.. విలియమ్స్, ర్యాన్ కాస్త పోరాడారు.
ఒకే ప్రాంతంలో బంతులు వేయాలని ముందే నిర్ణయించుకున్నా. పరుగులు నియంత్రించి ఒత్తిడి పెంచితే వికెట్లు వాటంతటవే వస్తాయి. వెస్టిండీస్, ఇంగ్లండ్లోనూ ఇదే వ్యూహంతో ఫలితాలు రాబట్టా. ఐపీఎల్లో తొలిసారి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎంపికైన సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ సార్ నాలో ఆత్మవిశ్వాసం నింపారు. నా నైపుణ్యాలను సరిగ్గా అర్ధం చేసుకొని, వెన్నంటి నిలిచారు. దీంతో నా పని మరింత సులువైంది. కెరీర్లో ఎత్తుపల్లాలు సహజం. – మహమ్మద్ సిరాజ్
జింబాబ్వే: కైటానో (సి) శాంసన్ (బి) సిరాజ్ 7, ఇన్నోసెంట్ (సి) శాంసన్ (బి) శార్దూల్ 16, మధెవెరె (సి) శాంసన్ (బి) ప్రసిద్ధ్ 2, చకాబవ (సి) గిల్ (బి) శార్దూల్ 2, సికందర్ (సి) ఇషాన్ (బి) కుల్దీప్ 16, విలియమ్స్ (సి) ధవన్ (బి) హుడా 42, ర్యాన్ (నాటౌట్) 39, జాంగ్వే (బి) శార్దూల్ 6, బ్రాడ్ ఇవాన్స్ (బి) అక్షర్ 9, విక్టర్ (రనౌట్) 0, చివాంగ (రనౌట్) 4, ఎక్స్ట్రాలు: 18, మొత్తం: 38.1 ఓవర్లలో 161. వికెట్ల పతనం: 1-20, 2-27, 3-29, 4-31, 5-72, 6-105, 7-129, 8-149, 9-156,10-161, బౌలింగ్: సిరాజ్ 8-2-16-1,ప్రసిద్ధ్ 6.1-1-28-1, శార్దూల్ 7-0-38-3, అక్షర్ 7-1-20-1, కుల్దీప్ 8-0-49-1,హుడా 2-0-6-1.
భారత్: ధవన్ (సి) ఇన్నోసెంట్ (బి) చివాంగ 33, రాహుల్ (బి) విక్టర్ 1, గిల్ (బి) ఇవాన్స్ (బి) జాంగ్వే 33, ఇషాన్ (బి) జాంగ్వే 6, హుడా (బి) సికందర్ 25, శాంసన్ (నాటౌట్) 43, అక్షర్ (నాటౌట్) 6, ఎక్స్ట్రాలు: 20, మొత్తం: 25.4 ఓవర్లలో 167/5. వికెట్ల పతనం: 1-5, 2-47, 3-83, 4-97, 5-153, బౌలింగ్: చివాంగ 7-0-38-1, విక్టర్ 4-0-32-1, జాంగ్వే 4-0-33-2, ఇవాన్స్ 4-0-21-2, సికందర్ 4-0-16-1, విలియమ్స్ 1-0-13-0, మధెవెరె 1-0-7-0, ఇన్నోసెంట్ 0.4-0-6-0.