న్యూఢిల్లీ: జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం నిలకడైన ప్రదర్శన కనబర్చిన మన అమ్మాయిలు ఆదివారం ఫైనల్లో 2-1తో సౌత్ కొరియాను చిత్తుచేసి టైటిల్ కైవసం చేసుకున్నారు. గతం (2012)లో ఒకసారి రన్నరప్గా నిలిచిన భారత్కు ఈ టోర్నీలో ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. తుదిపోరులో భారత్ తరఫున అన్నూ (22వ నిమిషంలో), నీలమ్ (41వ ని.లో) చెరో గోల్ చేయగా.. కొరియాకు పార్క్ సియో (25వ ని.లో) ఏకైక గోల్ అందించింది. రెండో క్వార్టర్లో భారత్ ఖాతా తెరువగా.. కాసేపటికే నాలుగుసార్లు చాంపియన్ కొరియా స్కోరు సమం చేసింది. మూడో క్వార్టర్లో నీలమ్ గోల్ చేయడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి వరకు అదే జోరు కొనసాగించిన మన అమ్మాయిలు తొలిసారి ఆసియా ట్రోఫీ చేజిక్కించుకున్నారు.
హాకీ ఇండియా నజరానా
ఆసియాకప్ చేజిక్కించుకున్న మన అమ్మాయిలకు హాకీ ఇండియా (హెచ్ఐ) నగదు బహుమతి ప్రకటించింది. జట్టులోని ప్లేయర్లకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సహాయ సిబ్బందికి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటించింది.