ఎన్నాళ్లకెన్నాళ్లకు! విరాట్ కోహ్లీ పంజా విసిరాడు. పరుగుల వేటలో ఆకలిగొన్న పులిని తలపిస్తూ పసికూన అఫ్గనిస్థాన్ను చీల్చిచెండాడు. విమర్శకులకు దీటైన సమాధానమిస్తూ సూపర్ సెంచరీతో కోహ్లీ కదంతొక్కాడు. పసలేని అఫ్గన్ బౌలింగ్ను ఊచకోత కోస్తూ అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు మూడేండ్ల తర్వాత శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అంతటితో ఆగకుండా పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియా తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రాహుల్ జతగా అఫ్గన్ బౌలర్లను ఆటాడుకున్న కోహ్లీ టీ20ల్లో తొలి సెంచరీతో జట్టుకు భారీ స్కోరు కట్టబెట్టాడు. లక్ష్యఛేదనలో స్వింగ్స్టార్ భువనేశ్వర్ కుమార్ పాంచ్ పటాకా మోగించడంతో అఫ్గన్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారీ విజయం ఖాతాలో వేసుకున్నా..ఫైనల్ ఆశలు చేజార్చుకున్న భారత్ ఆసియాకప్ నుంచి నిరాశగా వెనుదిరిగింది.
దుబాయ్: కింగ్ కోహ్లీ కమ్ బ్యాక్. ఆసియా టోర్నీలో భారత బెబ్బులి గర్జించింది. గురువారం అఫ్గానిస్థాన్తో జరిగిన సూపర్-4 ఆఖరి మ్యాచ్లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ(61 బంతుల్లో 122 నాటౌట్, 12ఫోర్లు, 6సిక్స్లు) అజేయ సెంచరీకి తోడు భువనేశ్వర్ కుమార్(4-1-4-5) విజృంభణతో అఫ్గన్పై 101 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో టీమ్ఇండియా అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది.
తొలుత టాస్ గెలిచిన అఫ్గన్ కెప్టెన్ మహమ్మద్ నబీ..భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. కోహ్లీకి తోడు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్(62) అర్ధసెంచరీతో నిర్ణీత ఓవర్లలో భారత్ 212/2 స్కోరు చేసింది. ఫరీద్ అహ్మద్(2/57) రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన అఫ్గన్..భువీ స్వింగ్ ధాటికి 111/8 స్కోరుకు పరిమితమై భారీ ఓటమి మూటగట్టుకుంది. ఇబ్రహీం జద్రాన్(64 నాటౌట్) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. వరుస మ్యాచ్ల్లో ఓటములు ఎదుర్కొన్న భారత్ ఫైనల్ చేరకుండానే ఆసియా కప్ నుంచి వైదొలుగగా, ఆఫ్గన్కు కూడా నిరాశే ఎదురైంది.
కోహ్లీ ధమాకా: రెగ్యులర్ కెప్టెన్ రోహిత్శర్మ విశ్రాంతికి మొగ్గుచూపడంతో రాహుల్, కోహ్లీ కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆది నుంచే అఫ్గన్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ వీరిద్దరు పరుగులు కొల్లగొట్టారు. ముఖ్యంగా కోహ్లీ…ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాహుల్ను అండగా చేసుకుంటూ అభిమానులకు పాత కోహ్లీని గుర్తు చేశాడు. బౌలర్ ఎవరన్నది లెక్కచేయని నైజంతో కొత్త శైలిలో కోహ్లీ చెలరేగాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ఖాన్ను కూడా ఉతికి ఆరేస్తూ స్కోరు బోర్డుకు పరుగులు జతజేశాడు. వీరిద్దరి దూకుడుతో టీమ్ఇండియా పవర్ప్లే ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నబీ బౌలింగ్లో కోహ్లీకి లైఫ్ లభించింది. బౌండరీ వద్ద ఇబ్రహీం క్యాచ్ విడిచిపెట్టడం అతడికి కలిసివచ్చింది. ఇక్కణ్నుంచి విరాట్ వెనుదిరిగి చూసుకోలేదు.
32 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ గేర్లు మార్చి అఫ్గన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరో ఎండ్లో రాహుల్ కూడా జతకలువడంతో టీమ్ఇండియా స్కోరు టాప్గేర్లో దూసుకెళ్లింది. అయితే ఫరీద్ బౌలింగ్లో రాహుల్ ఔట్ కావడంతో తొలి వికెట్కు 119 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. సూర్యకుమార్ యాదవ్ వచ్చి రావడంతోనే సిక్స్లతో విరుచుకుపడ్డాడు. ఆఖరి ఐదు ఓవర్లలో కోహ్లీ..తనదైన ట్రేడ్మార్క్ షాట్లతో అలరించాడు. వరుస బంతుల్లో ఫోర్, సిక్స్తో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో 21 బంతుల్లో 72 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు.
నిజాయితీగా చెప్పాలనుకుంటున్నాను..నా ఇన్నింగ్స్ చూసి నాకే నేను ఆశ్చర్యపోయాను. ఆరవై పరుగులు చేసిన సందర్భాలు కూడా నా వైఫల్యంగా లెక్కకట్టడం ఒక రకంగా షాక్కు గురిచేసింది. జట్టు విజయాల్లో ఎన్ని రకాలుగా పాలుపంచుకున్నా.. సరిపోలేదు. గత రెండున్నర సంవత్సరాలు చాలా ఆలోచించాను. ఈ నెలలో 34వ పడిలోకి ప్రవేశిస్తున్నాను. క్లిష్ట సమయాల్లో భార్య అనుష్క శర్మ నా వెన్నంటి నిలిచింది. నేను మళ్లీ పూర్వపు ఫామ్ అందుకోవడానికి ఆమె కారణం. ఈ సెంచరీని అనుష్కతో పాటు వామికాకు అంకితమిస్తున్నాను.
– విరాట్ కోహ్లీ
భువీ సూపర్
భారీ లక్ష్యఛేదనకు దిగిన అఫ్గన్ను భువనేశ్వర్ ఆదిలోనే కోలుకోని దెబ్బ తీశాడు. తన తొలి ఓవర్లోనే హజ్రతుల్లా(0), రెహమతుల్లా(0)ను ఔట్ చేశాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ దాదాపు ఓవర్కు ఒకరు చొప్పున వికెట్లు తీశాడు. భువీ బౌలింగ్ విజృంభణకు అఫ్గన్ బ్యాటర్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన నమోదు చేసుకున్నాడు.
1 అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన క్రికెటర్గా కోహ్లీ(122*)నిలిచాడు. రోహిత్శర్మ(118), సూర్యకుమార్ యాదవ్(117) ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 212//2 (కోహ్లీ 122 నాటౌట్, రాహుల్ 62, ఫరీద్ 2/57), అఫ్గానిస్థాన్: 20 ఓవర్లలో 111/8 (జద్రాన్ 64 నాటౌట్, రెహమాన్ 18, భువనేశ్వర్ 5/4, హుడా 1/3)